రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సీసీఎస్ సీఐ చామకూరి సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. హైదరాబాద్ సీసీఎస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) టీమ్-7 సీఐగా సుధాకర్ పని చేస్తున్నాడు.
ఏసీబీ వలకు చిక్కిన సీసీఎస్ సీఐ
మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులను చూసి పరుగు
వెంబడించి పట్టుకున్న వైనం
హిమాయత్నగర్, జూన్ 13 : రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సీసీఎస్ సీఐ చామకూరి సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. హైదరాబాద్ సీసీఎస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) టీమ్-7 సీఐగా సుధాకర్ పని చేస్తున్నాడు. ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన మణిరంగస్వామి అనే వ్యక్తి సుధాకర్ను కలిసి తన మీద సీసీఎ్సలో నమోదైన కేసు మూసివేతకు సహకరించాలని కోరాడు. ఇందుకోసం రూ.15 లక్షలు ఇచ్చేందుకు మణిరంగస్వామి అంగీకరించాడు. అనుకున్న ప్రకారం సీఐ సుధాకర్కు రూ.5 లక్షలను గతంలోనే చెల్లించాడు. రెండో విడతగా మరో మూడు లక్షలు ఇవ్వాల్సి ఉంది. దీనిపై రంగస్వామి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో బషీర్బాగ్ చౌరస్తాలోని సీసీఎస్ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలో రంగస్వామి నుంచి డబ్బు ఉన్న బ్యాగ్ను సుధాకర్ తీసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులను గుర్తించిన సుధాకర్ బ్యాగ్ను వదిలేసి అక్కడి నుంచి పరుగు తీశాడు. అతన్ని వెంబడించిన ఏసీబీ అధికారులు కొద్ది దూరంలోనే సుధాకర్ను పట్టుకుని అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.