గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు.
తిరుమల: గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని.. శ్రీ వేంకటేశ్వరస్వామే తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగుజాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు.