కుప్పం నియోజకవర్గ టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి నేడు భేటి అయ్యారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి వారి విన్నపాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకుపార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కుప్పం నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ… వైసీపీ నాయకులు ఓటర్లను అనేక ప్రలోభాలకు గురిచేసినా మేం కష్టపడి ప్రతి ఓటును జాగ్రత్తగా కాపాడగలిగాం. 2024 ఎన్నికల్లో వైసీపీ నేతలతో కాదు రాక్షసులతో పోట్లాడి చంద్రబాబును గెలిపించుకున్నాం. 2019లో 10వేల ఓట్లే మెజార్టీ వచ్చింది కానీ 2024 ఎన్నికల్లో 12వేలు మెజార్టీ వచ్చింది.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తిగా కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చంద్రబాబును ఓడించాలని ప్రయత్నం చేశాడు. కుప్పం కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం, హత్య కేసులు పెట్టి వేధించారు.మమ్మల్ని, ఓటర్లను బెదిరించాడు. మేం ఒకానొక స్థాయిలో నిరాశకు గురయ్యినప్పటికీ, తేరుకుని ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపును సాధించాం అని తెలిపారు.
ఆ సమయంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ యువతను పెద్దఎత్తున ప్రోత్సహించి, పెద్దిరెడ్డి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు మమ్మల్ని ముందుకు నడిపించారు.కుప్పం నియోజకవర్గం….నారా వారి కుప్పంగా నిలబెట్టేందుకు మా శాయశక్తులా పోరాడతాం..పార్టీని నిలబెడతాం. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి…దయచేసి అటువంటి వాటిపై అధిష్టానం దృష్టిసారించాలి.మున్సిపాలిటీలోని 40 డివిజన్లలో మంచి మెజార్టీ వచ్చిన ఒక డివిజన్ ను దత్తత తీసుకోవాలి.కుప్పంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి యువతకు భవిష్యత్తు చూపించాలి అని భువనేశ్వరిని కోరారు.
భువనమ్మ మాట్లాడుతూ.. గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీకోసం మీ జీవితాలను త్యాగం చేశారు. నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త అదేవిధంగా తోట చంద్రయ్యలను వైసీపీ నాయకులు జై వైసీపీ అని అనలేదని, జై జగన్ అనలేదని పీక కోసి చంపారు. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను పార్టీకోసం పణంగా పెట్టారు. వారందరికీ నా జోహార్లు. పార్టీకోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుంది. కష్టాలు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుంది. నేను నిజం గెలవాలి కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశానంటే…అది కుప్పం ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యమే. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధించారు. కుప్పం మున్సిపాలిటీలో 12వేల మెజార్టీ రావడం చాలా ఆనందం…అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పనిచేసి మంచి ఫలితాలు తెచ్చారు.
నేను నిజం గెలవాలి చేసినప్పుడు ధైర్యం చెప్పడానికి, ప్రోత్సహించడానికి చంద్రబాబు నా కళ్లముందు లేరు…కానీ పార్టీ కార్యకర్తలు నాకు ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో రాష్ట్రమంతా విజయవంతంగా నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేశాను. కుప్పం మున్సిపాలిటీకి రూ.250కోట్లు చంద్రబాబు శాంక్షన్ చేశారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మ్యానిఫెస్టోను చంద్రబాబు తప్పకుండా త్వరగా అమలు చేస్తారు. గతంలో మహిళలు బయటకు రాలేదు..కానీ 2024 ఎన్నికల సమయంలో ఊహించని రీతిలో మహిళలు రోడ్లపైకి వచ్చి పార్టీ కోసం పనిచేసి చంద్రబాబును గెలిపించారు. ఇదే స్ఫూర్తిని రానున్న కాలంలో కొనసాగించి పార్టీని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.