పటేల్ కాంగ్రెసోడైతే… విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదు?

– తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కాదు… తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి

– కాంగ్రెస్, బీఆర్ఎస్ లది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట…లేనప్పుడు మరోమాట
– తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే మేమూ భాగస్వాములమవుతాం
– తెలంగాణ ప్రజలను హింసించిన రజకార్ల పార్టీతో అంటకాగుతారా?
-జై పాకిస్తాన్, జై పాలస్తీనా అని నినదించిన ఒవైసీని పొగుడుతారా?
– కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట
– ఆపరేషన్ పోలోతో శస్త్రచికిత్స చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు పటేల్
– పరేడ్ మైదానంలో ‘ఫోటో ఎగ్జిబిషన్’ ను ప్రారంభించిన బండి సంజయ్
– తెలంగాణ పోరాట యోధులను వీక్షించడం ఆనందంగా ఉందని వ్యాఖ్య
– ప్రతి ఒక్కరూ ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించాలని పిలుపు
– తెలంగాణ విమోచన పోరాటాలను పాఠ్యాంశంగా చేర్చాలని కోరిన డాక్టర్ లక్ష్మణ్
– పరేడ్ మైదానంలో యువకులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడిన కేంద్ర మంత్రి

హైదరాబాద్: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్వవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన రజకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు.

అంతకుముందు మాట్లాడిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ విమోచన పోరాటాలను పాఠ్యంశంగా పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ నిర్వహిస్తోందని తెలిపారు.

తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తోపాటు పలువురు నేతలతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ను బండి సంజయ్ తిలకించారు.

అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే…తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని మాట ఇచ్చిన తరువాత వరుసగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మోదీ ఆదేశాలు, అమిత్ షా సూచనల మేరకు కేంద్ర పర్యాటక, సాంస్క్రుతిక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ భాగమై ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది.

అందులో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఫోటో ఎగ్జిబిషన్ ను చూడగటానే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణకు విముక్తి కోసం చేసిన పోరాటాలు…సమర యోధుల త్యాగాలను కళ్లకు కట్టినట్లుగా చూపారు.

తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాల చరిత్రను 75 ఏళ్లపాటు తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారు. ఎన్నో ఏళ్లపాటు తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని యువకులు జాతీయ జెండాలు పట్టుకుని ఉద్యమించారు. లాఠీదెబ్బలు తిన్నారు.
ఎందుకంటే నాడు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలు మామూలు విషయం కాదు. రజాకార్ల పాలనలో దారుణాలు అన్నీ ఇన్నీ కావు. బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, వెయ్యి ఊడల మర్రి సంఘటనలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన దురాగతాలు మరవలేం.

నిజాం నిరంకుశ పాలనపై కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటాలను, హిందూ మహాసభ, ఆర్య సమాజ్ పోరాటాలను గుర్తుచేసేందుకు, రాబోయే తరాలకు ఈ చరిత్రను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నాం.

తెలంగాణ విమోచన దినోత్సవానికి ప్రధాన కారకులు సర్దార్‌ వల్లభాయి పటేల్‌. దేశంలోని 562 సంస్థానాలు విలీనం చేసే క్రమంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు నిజాం అంగీకరించలేదు. దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు స్వాతంత్ర్యం రాకపోతే భారతమాత కడుపులో క్యాన్సర్ గడ్డ అట్లాగే ఉండిపోతుందనే ఉద్దేశంతో ఆఫరేషన్ పోలోతో శస్త్ర చికిత్స చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు సర్దార్ వల్లభాయి పటేల్.

తెలంగాణ విమోచన దినోత్సవాలు జరిపే అర్హత బీజేపీకి లేదన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై….మరి కాంగ్రెస్ కు మాత్రమే ఆ అర్హత ఉంటే ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు నిర్వహించడం లేదు? ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నూ 50 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించారు కదా.. మరి నాటి నుండి ఎందుకు నిర్వహించలేదు. నాటి తెలంగాణ పోరాట యోధులను ఎందుకు స్మరించలేదు? తెలంగాణ విమోచనం కోసం ఆపరేషన్ పోలో నిర్వహించిన సర్దార్ పటేల్ ను ఎన్నడైనా స్మరించిందా?
తెలంగాణ విమోచన దినోత్సవాలపై అధికారంలో లేనప్పుడు ఒకమాట… వచ్చాక మరోమాట… ఇదీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల తీరు. ఒక పార్టీ ఏమో ’సెప్టెంబర్‌ 17న సమైక్యత దినోత్సవం’ అంటది.. ఇఫ్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ‘ప్రజాపాలనా దినోత్సవం’ నిర్వహిస్తుందట. మరి దాదాపు 50 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలారు కదా… ఇన్నాళ్లు మీరు చేసింది ప్రజా వంచనా? ప్రజా వంచన దినోత్సవంగా నిర్వహించుకోండి.

నేనడుగుతున్నా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చి ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’ అని మార్చడానికి కారణమేంటి? బీజేపీ అధికారంలో ఉన్నా, లేకున్నా ఒకటే మాట. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలన్నదే మా లక్ష్యం. అదే చేస్తున్నం. తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరిపితే… మేమంతా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాం.

తెలంగాణ సాధన కోసం పోరాడిన 1500 మందిని బలిదానం చేసుకున్న పార్టీ కాంగ్రెస్. వారి ఉసురు తీసిన పార్టీ. వారి బలిదానాలతో తీవ్ర భావోగ్వేదానికి గురైన సుష్మాస్వరాజ్ ఎవ్వరూ చనిపోవద్దని పేర్కొంటూ తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేసి స్వరాష్ట్ర ఏర్పాటుకు క్రుషి చేసిన సంగతి మర్చిపోయారా?

నిజాం పాలనలో రజకార్ల దళం తెలంగాణ ప్రజలను ఊచ కోత కోసింది. మహిళలను బట్టలిప్పి బతుకమ్మ ఆడించింది. పరకాల, బైరాన్ పల్లి, గుండ్రాంపల్లిలో వందల మందిని బలి తీసుకుంది. అలాంటి రజకార్ల దళం పార్టీగా ఏర్పడితే… ఆ పార్టీ వారసుడైన ఒవైసీని సీఎం పొగడటం వెనుక ఉద్దేశమేంది?

జై పాలస్తీనా, జై పాకిస్తాన్ అనేటోళ్లకు వత్తాసు పలకడమంటే కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట. ఒకవైపు రాహుల్ గాంధీ అమెరికాకు పోయి భారతదేశాన్ని కించపరుస్తున్నడు. ఇక్కడ ఒవైసీకి వత్తాసు పలికి తెలంగాణను సీఎం కించపరుస్తున్నడు. యధా రాజా తథ ప్రజ. కాంగ్రెస్ ఆలోచన అంతా దేశాన్ని ముక్కలు చేయాలనే విధంగా మాట్లాడుతున్నట్లుంది.