80 స్థానాలకు ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం

– నిజామాబాద్ రూరల్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుంది.మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు…కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడుతుండు. నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్ కు చెబుతున్నా..80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారు. 80కి ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూపించి మేం ఓట్లు అడుగుతాం..కాళేశ్వరం మెడిగడ్డను చూపించి కేసీఆర్ ఓట్లు అడగగలవా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ మూతిమీదున్న మీసాలున్న మొనగాడివే అయితే ఈ ఛాలెంజ్‌కు అంగీకరించాలన్నారు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నీ దొరల రాజ్యాన్ని, దొంగల రాజ్యాన్ని పొలిమేరల వరకు తరిమి బొందపెట్టి బరాబర్ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్ల రాజ్యం. బీఆర్ఎస్ అంటే దొరల రాజ్యం, దొంగల రాజ్యం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ ఊహాలోకంలో ఉంచారు. ఆయన మాత్రం 150 రూముల బంగ్లా కట్టుకున్నాడని విమర్శించారు.

ఔను మాది ఇందిరమ్మ రాజ్యమే.. పేదోళ్లకు ఇళ్లు కట్టించాం. రైతుల రుణమాఫీ చేశాం, గిట్టుబాటు ధర చెల్లించాం, పోడు భూములకు పట్టాలు ఇచ్చాం, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాం, అందుకే మాది ఇందిరమ్మ రాజ్యమే. మాది దోపిడీల రాజ్యం కాదు, దొరల రాజ్యం కాదు, ఇసుక మాఫియా, భూ కజ్జాల మాఫియా, కమీషన్లు వసూలు చేస్తూ, ఆడబిడ్డల పుస్తెలు ఎత్తుకెళ్లే బీఆర్ఎస్ దొరల రాజ్యాన్ని తరిమి కొడదాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని మంచి పనులే.. పేదల సంక్షేమానికి కొదువ ఉండదని రేవంత్ రెడ్డి వివరించారు.

బోధన్ ఏసీపీ తన విధులు తాను చేసుకోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవవహరిస్తే డిసెంబర్ 9 తర్వాత ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. మా కార్యకర్తలను ఏసీపీ కొడుతున్నాడని మా నాయకులు చెబుతున్నారని ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. మా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు మా నాయకులు రెడ్ డైరీలో రాసుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరో ఆలోచన చేసుకోవాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

పదేళ్లలో కేసీఆర్ ఏ సమస్యను తీర్చలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. పోడు భూముల సమస్య తీర్చలేదు.. లంబాడాలను ఆదుకోలేదు మంచిప్ప ప్రాజెక్టును పూర్తి చేయ లేదని మండిపడ్డారు. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి పదేళ్లయినా హామీ నెరవేర్చలేదు. అందుకే కవితను ఇక్కడి రైతాంగం బండకేసి కొట్టారు అన్నారు.

అందుకే అప్పటి నుంచి కేసీఆర్ ఈ ప్రాంత రైతులపై కక్ష కట్టిండ్రు అని ఆరోపించారు. ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న ఇక్కడి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిర్లక్ష్యంతో, ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాశారు. 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను పొట్టనపెట్టుకున్న బాజిరెడ్డి గోవర్ధన్ ను వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలన్నారు.

అయ్య బక్కోడు.. కొడుకు తిరుగుబోతోడు. ప్రజలను ఆదుకోవాలంటే ఒక్కరూ ముందుకు రారు.ఎర్రజొన్న రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయలేదు. పసుపు బోర్డు తెస్తానన్న గుండోడు ఎక్కడికో పోయిండు. అని రేవంత్‌రెడ్డి తెలిపారు. బక్కోన్ని బక్కోన్ని అని చెప్పుకునే కేసీఆర్… లక్ష కోట్లు దిగమింగాడు..10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేను పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత యువకులు నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమని అడిగారు.

అధిష్ఠానం నన్ను కామారెడ్డిలో పోటీ చేయమని ఆదేశించిందన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎటువైపు ఉంటారో.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఉంటే 2 వేలే పింఛన్ ఇస్తారని అదే కేసీఆర్‌ను బొంద పెడితే ఇందిరమ్మ రాజ్యంలో 4 వేల పింఛన్ ఇస్తామన్నారు.

అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ తో ఎవరూ పోటీ పడలేరు
అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్ తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు..కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్ … మందేసి ఫామ్ హౌస్ లో పడుకున్నావా? నల్లవాగు లిఫ్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పిండు అని వ్యాఖ్యానించారు.

ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్ ను అభివృద్ధి చేసే బాధ్యత మాదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలన్నారు. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో సురేష్ షెట్కార్ ని పార్లమెంటు సభ్యుడిగా గెలుపించుకునే బాధ్యత మాది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించాలి.. పొలిమేరలకు తరమాలి
కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించాలి.. పొలిమేరలకు తరమాలి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండు..కామారెడ్డికే కాదు.. కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండే.. ఇయ్యాల ఎర్రవల్లిలో ఎట్లుండు గమనించాలన్నారు. రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకపోయేందుకె ప్రాధాన్యతనిచ్చిండు అని విమర్శించారు.

ఈ ప్రాంత రైతుల భూములను ముంచి.. ఆయన బంధువుల భూములను కాపాడుకుండు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకుండు.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా బంగారం పండుతుందా? అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచిండు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ముంపు బాధితుల పక్షాన ఆనాడు ఏటీగడ్డ కిష్టాపూర్ లో నేను దీక్ష చేశా. అధికారంలోకి రాగానే ముంపు బాధితులకు నష్ట పరిహారం ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు.

“నేను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయిండు..నా నోరు తెరిస్తే కంపు అని కొడంగల్ లో కేసీఆర్ అంటుండు. ఇద్దరం పోదాం… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుందాం. ఎవరి నోట్లో కంపు ఉందో తేలుద్దాం… పొద్దున లేస్తే ఎత్తుడు పోసుడే నీ పని.. నీతో నాకు పోలికా?” అని రేవంత్ రెడ్డి కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకొనివ్వం.. ముమ్మాటికీ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బక్కోడు కాదు… లక్షకోట్లు మింగి, పదివేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు కేసీఆర్ అని విమర్శించారు. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించండి… ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.