మళ్లీ.. ‘పీకే’సీఆర్‌ ముచ్చట్లు!

– నవంబర్‌ 20న ప్రశాంత్‌ కిశోర్‌తో కేసీఆర్‌ మంతనాలు
– 3 గంటల పాటు చర్చలు జరిగాయని వెల్లడి
– బీఆర్‌ఎస్‌ ఓడిపోతే అందుకు పీకే బాధ్యత వహిస్తారా అని ప్రశ్న
– పార్లమెంటు ఎన్నికల్లో పీకే బీజేపీకి పనిచేయబోతున్నారని మరో బాంబు
– సంచలనం సృష్టిస్తున్న గురురాజ్‌ ట్వీట్‌
– నిఘా నివేదికల ప్రమాద సంకేత ఫలితమేనా?
– కాంగి‘రేసు’ ఉధృతిని నివారించే మంత్రాంగమా?
– పీకే-కేసీఆర్‌ భేటీని వెల్లడించిన రాజకీయ వ్యూహ ర్త గురురాజ్‌ అంజన్‌
– ఆ మేరకు తాజాగా ట్వీట్‌ చేసిన అంజన్‌
– ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పీకేపై కేటీఆర్‌ కామెంట్‌
– ప్రభుత్వం ఎలా నడపాలో మాకు చెబితే ఎలా అని ప్రశ్నించిన కేటీఆర్‌
– ఇప్పుడు కేసీఆర్‌-పీకే భేటీలో ఆంతర్యం ఏమిటి?
– మారుతున్న కుల-మత సమీకరణల ఫలితమేనా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు-శాశ్వత శత్రువులు ఉండరన్నది ఒక సూత్రం. అది ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తలకూ వర్తించేలా కనిపిస్తోంది. కొద్దికాలం వరకూ కేసీఆర్‌కు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన.. బీహార్‌ రాజకీయ ఎన్నికల బేహారీ, ప్రశాంత్‌ కిశోర్‌ను ఆ తర్వాత కేసీఆర్‌ తొలగించారు.

నిజానికి జనాల దృష్టిలో.. కేసీఆర్‌ అంతటి వ్యూహకర్త లేరన్నది ఒక భావన. అంతలావు కేసీఆరే వ్యూహకర్తను డబ్బులిచ్చి పెట్టుకున్నారన్న ప్రచారం, ఆయన ఇమేజీని దెబ్బతీసింది. దానితో పీకేను పక్కనపెట్టారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల వేళ పీకేతో కేసీఆర్‌ ముచ్చట్ల వార్తలు చర్చనీయాంశ ంగా మారాయి. జనక్షేత్రంలో కారు జోరు తగ్గుతోందని.. ఎన్నికల ప్రచారంలో కాంగి‘రేసుగుర్రం’లా పరుగులు తీస్తుందన్న క్షేత్రస్థాయి నివేదికల ఫలితవే, ు వారిద్దరి భేటీ కావచ్చన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

నవంబర్‌ 20న కేసీఆర్‌-పీకే భేటీ జరిగిందంటూ మరో రాజకీయ వ్యూహకర్త గురురాజ్‌ అంజన్‌ చేసిన ట్వీట్‌ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి మధ్య 3 ంగటలపాటు చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి బలహీనంగా ఉందన్న నిఘా నివేదికలతోనే కేసీఆర్‌ హటాత్తుగా పీకేని పిలిపించారని పేర్కొన్నారు.

మరి ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతే ఆ బాధ్యత పీకే తీసుకుంటారా? అని ప్రశ్నించారు. చివరగా.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పీకే బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేయబోతున్నట్లు ఓ బాంబు పేల్చారు. పీకే గతంలో బీజేపీకి పనిచే సిన విషయాన్ని గురురాజ్‌ తన ట్వీట్‌లో గుర్తు చేశారు.

అయితే వారిద్దరి చర్చల సారాంశం ఏమిటన్నది గురురాజ్‌ వెల్లడించకపోయినా… క్షేత్రస్థాయిలో తగ్గిన కారు జోరును, మళ్లీ పెంచాలన్నదానిపైనే ఉంటుందన్నది, మెడపై తల ఉన్న ఎవరికయినా తెలిసిందే. దానికితోడు నిఘా దళాలు కూడా క్షేత్రస్థాయిలో కారు జోరు గణనీయంగా తగ్గిందంటూ ఇస్తున్న నివేదికలు కూడా, వారి ఆకస్మిక భేటీకి మరో కారణమంటున్నారు.

ఇప్పటివరకూ పలు జాతీయ మీడియా సంస్థలతోపాటు.. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన సర్వే నివేదికల్లో 80 శాతం కాంగ్రెస్‌ పార్టీనే అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఉస్మానియా విద్యార్ధుల పేరుతో వెల్లడైన సర్వే ఫలితాలు కూడా, కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపించడం గమనార్హం. తాజాగా ముస్లిం విద్యావంతుల వేదిక సైతం, ముస్లిం సమాజం కాంగ్రెస్‌కే మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. ‘తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ’ తాజాగా ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి, తాము కాంగ్రెస్‌ పార్టీకి మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ వంటి సెక్యులర్‌ పార్టీనే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయమని స్పష్టం చేసింది. అంతకుముందే మాదిగలు, బీజేపీకి మద్దతునిస్తున్నట్లు ఎమ్మార్పీస్‌ అధినేత మందకృష్ణ మాదిగ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌-పీకే భేటీకి సహజంగానే ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం మారుతున్న కుల-మత సమీకరణలను దృష్టిలో ఉంచుకునే, వారిద్దరి మధ్య చర్చలు జరిగిఉంటాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రధానంగా ఇప్పటివరకూ బీఆర్‌ఎస్‌ను అంటిపెట్టుకున్న ముస్లింలలో భారీ స్థాయిలో వస్తున్న చీలిక కూడా, బీఆర్‌ఎస్‌ ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. ముస్లింలలో మెజారిటీ శాతం, కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్న నివేదికలు వెల్లడవుతున్నాయి. ఇది బీఆర్‌ఎస్‌కు ప్రమాధ ఘంటికగానే భావిస్తున్నారు.

తాము వ్యక్తిగతంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం కాకపోయినప్పటికీ.. ఢిల్లీలో బీజేపీని గద్దె దింపాలంటే, ఇక్కడ కాంగ్రెస్‌ లాంటి సెక్యులర్‌ పార్టీనే గెలిపించాలన్న మానసిన భావన, ముస్లిం సమాజంలో విస్తృతమవుతోంది. ముస్లిం సమాజం అంతా మోదీ-అమిత్‌షాపై వ్యక్తిగత ద్వేషంతోనే, బీజేపీని వ్యతిరేకస్తున్నట్లు వారి వైఖరి స్పష్టం చేస్తోంది. అదీగాక రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చాం కదా అన్న అభిప్రాయం కూడా ముస్లిం వర్గాల్లో వ్యక్తమవుతోంది.

విచిత్రంగా సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌ వంటి నియోజకవర్గాల్లో.. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ముస్లిం నేతలతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నందున, అలాంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు తక్కువగా చీలే అవకాశం ఉంది. అయితే ఈ సంఖ్య తక్కువే. ఫలితంగా బీఆర్‌ఎస్‌కు ముస్లిం ఓటర్లు భారీ సంఖ్యలోనే దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో జైకొట్టిన ముదిరాజు సామాజికవర్గం కూడా.. ఇప్పుడు మూకుమ్మడిగా బీఆర్‌ఎస్‌ను వ్యతిరేస్తున్న వైనం, ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. ముదిరాజ్‌లకు సీట్లు ఇవ్వకుండా అవమానించిన ఫలితంగా… ఆ కుల సంఘాలన్నీ ఒకేమాటకు కట్టుబడి ఎన్నికల్లో పనిచేస్తున్న పరిస్థితి. గత కొద్దిరోజుల నుంచి ముదిరాజు కులస్తులకు.. ‘మీరు ఓటు ఎవరికైనా వేసుకోండి. కానీ బీఆర్‌ఎస్‌కు మాత్రం వేయవద్దు’ అని ఫోన్‌ సందేశాలు వస్తుండాన్ని, తేలిగ్గా కొట్టివేయలేం. తెలంగాణ బీసీల్లో, అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం ముదిరాజులేనన్నది విస్మరించకూడదు.

ఈ నేపథ్యంలో కేటీఆర్‌-పీకే భేటీలో, వీటికి ప్రత్యామ్నాయాలపైనే చర్చించినట్లు అర్ధంచేసుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ముస్లిం-ముదిరాజుల ఓట్లను పొందే వ్యూహాలపైనే, వారిద్దరి చర్చ జరిగి ఉండవచ్చని పార్టీ వ ర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్‌ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పీకేను తాము ఎందుకు పక్కనపెట్టిందో వెల్లడించారు. ‘ఆయన ప్రభుత్వం ఎలా పనిచేయాలో మాకు చెబితే ఎలా’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే పీకేకు.. మళ్లీ ప్రగతిభవన్‌ ద్వారాలు తెరవడమే ఆశ్చర్యం.