మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది…

-కిషన్‌రెడ్డి ఎంపీ అయినా ఒరిగేదేం లేదు
-అంబర్‌పేట్‌ కుంటలోనే వచ్చే బతుకమ్మ
-కార్నర్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

అంబర్‌పేట్‌, మహానాడు: మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అంబర్‌పేట్‌ కార్నర్‌ మీటింగ్‌లో సోమవారం ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. పదేళ్లుగా మోదీ అధికారంలో ఉన్నా కిషన్‌రెడ్డి అంబర్‌పేట్‌ బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయించలేదు? హైదరాబాద్‌ నగరంలో వరదలు వస్తే అణా పైసా పేదలకు ఇప్పించలేదు? బండి పోతే బండి ఇస్తానన్న అరగుండు జాడ లేకుండా పోయారు. కిషన్‌ రెడ్డి మళ్లీ ఎంపీ అయినా హైదరాబాద్‌ నగరానికి, అంబర్‌పేట్‌కు ఒరిగేదేం లేదు. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్ర యం నిర్మాణం జరిగింది. వచ్చే బతుకమ్మ పండుగ అంబర్‌పేట్‌ బతుకమ్మ కుంటలోనే జరిగేలా చేసే బాధ్యత నాది..కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం.. రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం ..దానం నాగేందర్‌ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత తనదని తెలిపారు.

మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది..మన దేశంలో ఆకలి కేకలు ఎక్కువని సర్వేలు తేల్చాయన్నారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోయింది.. అది చచ్చిన పాముతో సమానం. కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని కేటీఆర్‌ అంటుండు. కేటీఆర్‌.. నువ్‌ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు…నిన్ను టికెట్‌ అడిగితే కాంగ్రెస్‌ గ్యారంటీలను అమలు చేయనట్లు… అడగకపోతే గ్యారంటీలు అమలు చేసినట్లని సమాధానమిచ్చారు. తండ్రి, కొడుకులు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మోసాల కాలం చెల్లింది..ఇక మిమ్మల్ని నమ్మేవారు ఎవరూ లేదు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డే..దానికి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.