Mahanaadu-Logo-PNG-Large

కొత్తదనమున్న చిత్రాలను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు – నందమూరి బాలకృష్ణ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. భారీ అంచనాలతో మే 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మే 28వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. మే 28న యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి జయంతి. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఫస్ట్ లుక్ విడుదల చేసిన నిర్మాతలు, ఈ ఏడాది ఎన్టీఆర్ 101వ జయంతికి ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడం విశేషం. ఇక ఈ కార్యక్రమానికి ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయడం మరో విశేషం. ఈ కార్యక్రమంలో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” నుంచి “గిరి గిరి” అనే మాస్ సాంగ్ ను బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, దైవాంశ సంభూతుడు, విశ్వానికే నటవిశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, కళాప్రపూర్ణ శ్రీ నందమూరి తారక రామారావు గారికి, ఆయన 101వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతాను. అదే కాపాడుతుంది అనుకుంటా. సినిమా అంటే అంత పాషన్. ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మాతలు నాగవంశీ గారికి, సాయి సౌజన్య గారికి ఆల్ ది బెస్ట్. నాన్నగారి 101వ జయంతి సందర్భంగా ఈ సినిమా వేడుక జరగడం సంతోషంగా ఉంది. మనకి సంక్రాంతి, ఉగాది ఎలాగో.. ప్రతి సంవత్సరం మే 28న కులాలకు, మతాలకు అతీతంగా అందరూ జరుపునే పండుగ రామారావు గారి జయంతి. అలాంటి రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా మా సోదరుడు విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అంటారు. సినీ పరిశ్రమలో కొంతమందితోనే నేను చాలా సన్నిహితంగా ఉంటాను. విశ్వక్ కి సినిమా అంటే పాషన్. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాను. తను కూడా నాలాగే సినిమా సినిమాకి, పాత్ర పాత్రకి కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా ఉంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్ విభిన్నంగా ఉంది. టైటిల్ తోనే సినిమా పట్ల ఆసక్తి కలుగుతోంది. ట్రైలర్ చాలా బాగుంది. గోదావరి అందాలతో పాటు, మంచి ఎమోషనల్ గా ఉంది. మంచి కిక్కిచ్చే సినిమాలా ఉంది. నిర్మాత నాగవంశీ, సోదరుడు విశ్వక్ సేన్ కలయికలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. మనం ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలి. అది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మనం కొత్తదనం ఇస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఈ సినిమాలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. అలాగే దర్శకుడు కృష్ణ చైతన్య. నేను బాలకృష్ణుడిని, ఈయన కృష్ణచైతన్య.. అదీ తేడా. అంతకముందు మా నారా రోహిత్ తో ‘రౌడీ ఫెలో’, నితిన్ తో ‘ఛల్ మోహన్ రంగ’ చేశారు. ఆ రెండు సినిమాలు ఆదరణ పొందాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఈ సినిమలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు నారి నారి నడుమ మురారిలా. అంజలితో కలిసి ‘డిక్టేటర్’ సినిమా చేశాను. మంచి మనిషి. అలాగే నేహా శెట్టి కూడా డీజే టిల్లు తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. విశ్వక్ సేన్ ని అతని తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగే నా తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి వస్తాడు. వాడికి ఈ తరం హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.