విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక

ఆ శిథిలాలను తొలగించం
– మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సీఎం నారా చంద్రబాబు నాయుడు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తమ ప్రభుత్వ ఆలోచనలను వెల్లడించారు. తమ ప్రభుత్వంలో సిఎం… సామాన్య ప్రజలను కలిసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లిన సమయంలో పరదాలు, బారికేడ్లు, ఆంక్షలు ఉండకూడదు అనేది తమ విధానం అని ముఖ్యమంత్రి అన్నారు.

సెక్యూరిటీ నిబంధనలు పాటిస్తూనే సాధ్యమైనంతగా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజల నుంచి తానే నేరుగా వినతులు తీసుకునేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలు ప్రభుత్వ పెద్దలతో చెప్పుకునే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. దీనికి కోసం ఏ పద్ధతి అనుసరించాలి..ఎలా చేయాలి అనే విషయాన్ని చర్చిస్తున్నామని సిఎం అన్నారు.

సచివాలయంలోనే వినతులు స్వీకరణ కార్యక్రమం పెట్టవచ్చా…లేక ప్రజా వినతులు స్వీకరణకు మరేదైనా వేదికను ఏర్పాటు చేయాల్సి ఉంటుందా అనేది ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. వినతులు స్వీకరించే ప్రాంతంలో కనీస సౌకర్యాలు ఉంటేనే అక్కడికి సమస్యలపై వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చంద్రబాబు అన్నారు. నాడు ఉన్న ప్రజావేదిక ఉండి ఉంటే వినతులు స్వీకరణ కు అనువుగా ఉండేది, కానీ గత ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చి వేసిందని అన్నారు.

ప్రజా వేదిక ప్రాంతాన్ని ఏం చేస్తారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా….వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధ్వంస పాలనకు ప్రతీకగా దాన్ని అలాగే ఉంచుతామని, ఆ శిథిలాలను తొలగించమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని, నష్టాన్ని కూల్చివేయబడిన ఆ ప్రజావేదిక ఎప్పటికీ చాటి చెపుతుందని సిఎం అన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన మొదలైంది ప్రజావేదిక కూల్చివేత ద్వారానే కాబట్టి…దాన్ని ఒక చిహ్నంగా ఉంచుతాం అని చెప్పారు.

ఇకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర సచివాలయంలో, రాజధాని ప్రాంతంలో యాక్టివిటీ బాగా పెరుగుతుందని…..సచివాలయానికి రాకపోకలు కోసం రోడ్లు, రవాణా, ఇతరత్రా సౌకర్యాలు పెంచుతామని అన్నారు. పోలవరం పర్యటన ద్వారా తన క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభం అవుతాయని తనను కలిసిన మీడియా ప్రతినిధులకు ముఖ్యమంత్రి తెలిపారు.