– యడ్లపాడులో గ్రీవెన్స్ నిర్వహించిన ప్రత్తిపాటి
యడ్లపాడు, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వారం వారం మండలాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రతివారం ఒక మండలంలో ఈ వేదిక నిర్వహించి ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశా లతో పాటు రెవిన్యూ సమస్య ల వరకు అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. యడ్లపాడు ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం ఎమ్మెల్యే గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. మండలంలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
ఇంటి స్థలాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగళ్లు, రీసర్వేలో తప్పులు, హద్దు రాళ్లు తొలగించడం, అధిక ధరకు ఎరువుల విక్రయం, రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలని అర్జీల రూపంలో పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గృహ రుణాల బకాయిలు చెల్లించాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, ఆర్డబ్ల్యూఎస్ విభాగం తరఫున పైప్లైన్లు వేయాలని దరఖాస్తులు వచ్చాయి.
జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో ఆక్రమణలు తొలగించాలని, యడ్లపాడు బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు సర్వీసుల సంఖ్య పెంచాలని, గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఆశా వర్కర్లను నియమించాలని అందిన ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం మాట్లాడిన ఆయన నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణం, 3 మండలాలు ఉన్నాయని, నెలకోసారి గ్రీవెన్స్ సెల్కు తానే హాజరవుతానని తెలిపారు. గత ఐదేళ్లలో ఎవరైనా వైసీపీ అరాచకాలకు, అధికారదాహానికి నష్టపోయుంటే ఆ సమస్యలూ గ్రీవెన్స్ సెల్లో చెప్పుకోవచ్చన్నారు.
ఎరువుల సమస్య ఉందని తన దృష్టికి తెచ్చారని, రూ. వంద ఎక్కువగా విక్రయిస్తున్నారని చెప్పారని, తొలుత హెచ్చరిస్తామని, రెండోసారి లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. ఎక్కడా అధిక ధరలకు ఎరువులు విక్రయించడానికి వీల్లేదని, ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.