నెలరోజుల్లో కృష్ణమ్మ హారతి పునఃప్రారంభం

– దేవాదాయశాఖ మంత్రి ఆనం

అమరావతి, మహానాడు: గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంఘమం(ఇబ్రహీంపట్నం) ఫెర్రీ వద్ద నెలరోజుల్లోగా కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమం పునఃప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం(జిఓఎం)సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవిత్ర సంఘమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించినట్టు తెలిపారు. అయితే గత ఐదేళ్ళ కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మరలా కృష్ణమ్మహారతిని నెల రోజుల్లోగా పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కృష్ణమ్మ హారతి నిర్వహహణకు పవిత్ర సంఘమం-ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాలైన రహదార్లు, విద్యుత్, బస్సు రవాణా, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు సంబంధిత శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ముఖ్యంగా ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం, జలవనరులు, సిఆర్డిఏ, దేవాదాయశాఖ, దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, పోలీస్, ట్రాన్సుకో, మున్సిపల్ తదితర శాఖల అధికారులు వారి స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించుకుని తగు చర్యలు చేపట్టాలన్ని మంత్రి ఆదేశించారు. రానున్న రోజుల్లో పవిత్ర సంఘం వద్ద కేవలం కృష్ణమ్మ హరతికే పరిమితం కాకుండా ఆప్రాంతాన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించి ఏర్పాటైన మంత్రుల కమిటీ తొలి సమావేశం జరిగిందని అధికారుల స్థాయిలోను, జిల్లా యంత్రాంగం స్థాయిలోను సంబంధింత శాఖల అధికారులతో మరిన్ని సమావేశాలు నిర్వహించి త్వరిత గతిన కృష్ణమ్మ హారతిని పునఃప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజమహేంద్రవరంలో గోదావరి హారతి ప్రస్తుతం కొనసాగుతోందని దానిని మరింత పటిష్ఠవంతంగా నిర్వహించేందుకు కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్ధసారథి మాట్లాడుతూ కృష్ణమ్మ హారతి అనేది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని దానిని నెలరోజుల్లోగా పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్కడ టిటిడి లేదా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆప్రాంతాన్ని రాష్ట్రానికే ఒక ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. అక్కడకు వచ్చే పర్యాటకులు, భక్తులు తదితరులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఆదిశగా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.

దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ 2016 నుండి పవిత్ర సంఘమం వద్ద కృష్ణమ్మ హారతి జరగలేదని, తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా ఏర్పాట్లను యుద్ద ప్రాతిపదికన చేపట్టాల్సి ఉందన్నారు. కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఇప్పటికే పవిత్ర సంఘమం, ఇబ్రహీం పట్నం ఫెర్రీవద్ద జంగిల్ క్లియరెన్సు పనులను చేపట్టినట్టు తెలిపారు. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇఓ రామారావు మట్లాడుతూ కృష్ణమ్మ హారతి నిర్వహణకు 6 పంట్లు,10 సెట్ల హరతులు అవసరం ఉందని చెప్పారు. సమావేశంలో డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ మురళి, విజయవాడ పశ్చిమ డిసిపి టి.హరికృష్ణ,ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.