Mahanaadu-Logo-PNG-Large

అధికారుల్లో రెడ్ బుక్ టెన్షన్ టెన్షన్ …

వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ను ఇబ్బంది పెట్టిన అధికారులు పై- టీడీపీ టార్గెట్ పెట్టుకున్న అధికారులకు ఇబ్బందేనా ?

రెడ్ బుక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారుల్లో కొంత మందికి గుబులు పుట్టిస్తున్న అంశం.

వైసీపీ పార్టీ హయాంలో కొంత మంది అధికారులు గీత దాటి మరీ వ్యవహరించారు.

తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారని వారినెవ్వరిని వదిలి పెట్టేది లేదని అందరి పేర్లూ రెడ్ బుక్‌లో ఉన్నాయని నారా లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు.

ఇలా హెచ్చరిస్తున్నారని చెప్పి సీఐడీ అధికారులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు.

చంద్రబాబు బెయిల్ రద్దు వాదనల సమయంలో సుప్రీంకోర్టులోనూ వినిపించారు.

ఇప్పుడు ఆ రెడ్ బుక్ అమలు చేసేందుకు అవకాశం టీడీపీకి .. నారా లోకేష్‌కు వచ్చింది. అందుకే అధికారులు గుబులు పడుతున్నారు.

తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదిలే చాన్సే లేదంటున్న నారా లోకేష్

ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అప్పుడే చాలా మందిలో ఇక రెడ్ బుక్ ను అమలు చేయరా అని ప్రశ్నించారు. కానీ కక్ష సాధింపులు ఉుండబోవని చెప్పాను కానీ..తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయని వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని అంటున్నారు. అంటే రెడ్ బుక్ అమలు జరిగి తీరుతుందని చెప్పకనే చెప్పారు. దీంతో అధికారుల్లో గుబులు ప్రారంభమయింది.

కొంత మంది అధికారుల్ని కలిసేందుకు చంద్రబాబు నిరాసక్తత

తాము ప్రతిపక్షంలో ఉండగా కొంత మంది అధికారులు వ్యవహరించిన తీరు.. తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ అగ్రనాయకత్వంలో చాలా ఆగ్రహం ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్నే లేదంటున్నారు. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అదికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని నివాసానికి వస్తున్నారు. అయితే అందరికీ చాన్స్ ఇవ్వడం లేదు. చీఫ్ సెక్రటరిగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం బోకే ఇచ్చే అవకాశం మాత్రమే కల్పించారు. ఆయన తీరుపై చంద్రబాబు ఆగ్రహం ఉన్నారు. పైగా జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి.దీంతో ఆయనను సెలవుపై పంపేశారు. అలాగే సీఐడీ చీప్ గా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవు పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను నిలువరించారు.దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయనను చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్లనీయలేదు. అలాగే ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్సాఆర్ సీతారామాంజనేలు, సీనియర్ ఐపీఎస్.. చంద్రబాబును కర్నూలులో అరెస్టు చేసిన కొల్లి రఘురామిరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నించారు. వారెవరికీ అనుమతి లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా దూరం పెట్టారు . ఆయనను కలిసేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. వీరంతా రెడ్ బుక్ లో ఉన్నారని భావిస్తున్నారు.

తప్పుడు కేసులు పెట్టిన వారందరికీ గడ్డు కాలమేనా ?

వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీీడిపీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా యాభై రోజులకుపైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో కనీస సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. స్కిల్ కేసు సహా అన్నీ తప్పుడు కేసులేనని .. తప్పుడు కేసులు పెడుతున్న సీఐడీ అధికారుల్ని వదిలేది లేదని స్పష్టం చేసింది. సీఐడీ చీఫ్ గా ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు పని చేశారు. ఒకరు పీవీ సునీల్ కుమార్ కాగా.. మరొరకరు సంజయ్. వీరిద్దరిపై టీడీపీ విరుచుకుపడుతూ వస్తోంది. రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మందిపై ఆరోపణలు చేస్తోంది. టీడీపీ నేతల్ని విపరీతంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

డిప్యూటేషన్ అధికారులు కీలకం !

రెడ్ బుక్‌లో ఉన్న వారిలో ఉన్న డిప్యూటేషన్ అధికారులు కీలకం. జగన్ సీఎం అయిన తర్వాత డిప్యూటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కీలక పదవుల్లో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారందరూ రిలీవ్ అవ్వాలన్నా అంగీకరించడం లేదు. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులకు ఇదే చెబుతున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై తప్పుడు కేసుల్లో ప్రధాన వ్యక్తి. ఆయన తాను పోతానంటూ లెటర్ పెట్టుకున్నారు. గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి కూడా అదే చేశారు. ఇక సాక్షితో పాటు వైసీపీ ప్రచారానికి ప్రజాధనం దోచి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, మద్యం స్కామ్ ను తన చేతులపై నడిపించిన ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అంతా తాము తమ శాఖలకు వెళ్లిపోతామని లెటర్లు పెట్టుకున్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. తెలంగాణాకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. తెలంగాణాకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులూ దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవర్నీ కదలనీయకుండా చేస్తోంది. సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సెలవునుకూడా తిరస్కరించారు. సెటిల్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు.

 

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం… కీలకమైన విచారణలు, దర్యాప్తులు ఉండే అవకాశం ఉంది. ఎంతో మంది అధికారులు జైలుకెళ్లే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.