Mahanaadu-Logo-PNG-Large

గురువు ఎప్పటికీ గురువే… తెలుసుకో శిష్యా!

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల పేరుతో చేసిన హడావుడి, మళ్ళీ ఇటీవల లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 12 ఎంపీ సీట్లు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ పలికిన ప్రగల్భాలు అందరూ వినే ఉంటారు. కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు కనీసం ఒక్క సీటు ఇవ్వకుండా మళ్ళీ ఓడగొట్టారు. అయితే చంద్రబాబు నాయుడు ఆయనలా చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలకలేదు. కానీ ఇప్పుడు చక్రం తిప్పబోతున్నారు.

ఈసారి బీజేపీ సొంతంగా 300కి పైగా సీట్లు, ఎన్డీయే భాగస్వాములతో కలిసి 400 సీట్లు సాధిస్తుందని బీజేపీ అధిష్టానం భావించింది. కానీ మోడీ ప్రభుత్వం కేవలం 21 సీట్ల అదనపు బలంతో మళ్ళీ కేంద్రంలో అధికారం చేపట్టబోతోంది! దానిలో టిడిపి (16), జనసేన (2) సీట్లు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ (జేడీయు) కూడా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఆయన ఏ క్షణంలో ఇండియా కూటమి వైపు జంప్ చేసేస్తారో ఎవరికీ తెలీదు.

గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారుగా? అంటే అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు… ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏపీలో పరిస్థితులను చక్కదిద్దుకొని అభివృద్ధిబాట పట్టించడానికి చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు చాలా అవసరం. కనుక ఈసారి ఎన్డీయేకి దూరం అయ్యే ఆలోచన కూడా చేయరు.

ఏపీ ఎన్నికలకు ముందు టిడిపితో అయిష్టంగానే పొత్తుకి అంగీకరించిన బీజేపీ అధిష్టానానికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అత్యంత విశ్వసనీయమైన మిత్రుడుగా మారారని చెప్పవచ్చు. ఈవిదంగా మోడీ-చంద్రబాబులకు ఒకరి అవసరం మరొకరికి చాలా ఉంది కనుక పరస్పరం సహకరించుకుంటూ పనిచేస్తారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలక భాగస్వామిగా మారారు కనుక జాతీయ రాజకీయాలలో మళ్ళీ ఆయనకు గుర్తింపు, ప్రాధాన్యత రెండూ కూడా పెరుగబోతున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏనాడూ కేసీఆర్‌లాగా ప్రగల్భాలు పలకలేదు. అధికారంలో లేనప్పుడూ, ఉన్నప్పుడూ కూడా అదే హుందాతనం, నిబ్బరంతో ముందుకు సాగుతూ కేసీఆర్‌ కంటే చాలా పరిణతి చెందిన రాజకీయ నాయకుడినని నిరూపించుకుంటున్నారు.