Mahanaadu-Logo-PNG-Large

ప్రజ్వల్ రేవణ్ణ కేసులో మరో ట్విస్ట్.. పరారీలో తల్లి భవానీ

లైంగిక దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రజ్వల్‌ను రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన సిట్.. ఆయన తల్లి భవానీ రేవణ్ణకు నోటీసులు జారీచేసింది. ఇంటి వద్దే ఉండాలని, విచారణకు తమ సహకరించాలని సిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది. కానీ, ఆమె ఇంట్లో లేరని, పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. లైంగిక దాడి, కిడ్నాప్ కేసుల్లో ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్నారు. భవానీపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ భవానీ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఇంటిలో పనిచేసిన సహాయకురాలి కిడ్నాప్, బెదిరింపుల కేసులో భవానీ రేవణ్ణ పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉంటుందని సిట్ పేర్కొంది. ‘కేఆర్ నగర్ కిడ్నాప్ కేసులో మీ పాత్రపై వివరణ కోసం మేం విచారిస్తాం… మీరు ఇంటి వద్దే ఉండాలి.. మీ అంగీకారం ప్రకారమే శనివారం వ్యక్తిగతంగా విచారణకు అందుబాటులో ఉండాలని మేం కోరాం.. మహిళా అధికారులతో జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మిమ్మల్ని ప్రశ్నించేందుకు వస్తాం. మీరు ఇంట్లోనే ఉండాలని కోరతున్నాం’ అని ఆ నోటీసు సిట్ స్పష్టం చేసింది.

కానీ సిట్ మహిళా అధికారులు రేవణ్ణ ఇంటికి వెళ్లినప్పుడు ఆమె అక్కడ లేరని, మొబైల్ ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తుందని అధికారులు తెలిపారు. ఒకవేళ ఆమె ఇంటికి వస్తే ప్రశ్నించేందుకు సాయంత్రం 5 గంటల వరకూ ఇంటి వద్దే వారు పడిగాపులు కాశారు. కానీ, ఆమె రాకపోవడంతో సిట్ వెనుదిరిగింది. భవానీ రేవణ్ణ, ఆమె కుటుంబ సభ్యులు పలుకుబడి ఉన్న వ్యక్తులని, సాక్ష్యులను ప్రభావితం చేసి, ఆధారాలను తారుమారు చేయగలరని సిట్ ఆరోపించింది. మరోవైపు, విచారణ సమయంలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రజ్వల్ రేవణ్ణ సరైన సమాధానం చెప్పడం లేదు. మీ ప్రశ్నలకు మా లాయర్ సమాధానం చెబుతారని, ఆయనతో మాట్లాడాలని అధికారులతో అన్నట్టు తెలుస్తోంది.