384 కి.మీ. 7 ఎన్.హెచ్.ల అభివృద్దికి రూ.6585 కోట్లు మంజూరు

• గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం
•పిపిపి విదానం అద్యయనానికై గురజాత్ వెళుతున్న అదికారుల బృందం
రాష్ట్ర రోడ్లు&భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి

అమరావతి, సెప్టెంబరు 19: రాష్ట్రంలో 384 కి.మి. మేర ఏడు జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు&భవనాలు,మౌళిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపుతూ ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో పలు మార్లు సంప్రదింపులు జరపడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ భారత మాల కార్యక్రమం క్రింద గతంలో రాష్ట్రానికి మంజూరు చేసిన ఈ ఏడు ప్రాజెక్టులు, పలు కారణాల వల్ల ఆగిపోవడం జరిగిందన్నారు. అయితే వీటిని మళ్లీ పునరుద్దరించి సంబందిత నిధులు రాష్ట్రానికి మంజూరు చేయించాలనే లక్ష్యంతో, బుధవారం తాను స్వయంగా డిల్లీ వెళ్లి కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయంతో చేసిన సంప్రదింపులు ఫలప్రదం అయ్యాయన్నారు.

ఫలితంగా స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆ ఏడు ప్రాజెక్టులను భారత మాల పథకం నుంచి తొలగించి నేషనల్ హైవేస్ అర్డనరీ ప్రొగ్రామ్ (NHO) నందు చేర్చి నేడు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడం వల్ల రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు మరో ముందడుగు పడినట్లైందన్నారు. నేషనల్ హైవేస్ అర్డనరీ ప్రొగ్రామ్ (NHO) క్రింద రాష్ట్రానికి మంజూరు చేసిన ఆ ఏడు ప్రాజెక్టుల వివరాలను ఆయన తెలుపుతూ….

1)కొండమూడు నుంచి పేరిచర్ల వరకు 49.9 కి.మీ మేర జాతీయ రహదారి
2)సంగమేశ్వరం నుంచి నల్లకాలువ మరియు వెలుగోడు నంద్యాల జిల్లా వరకు 62.5 కి.మీ జాతీయ రహదారి
3)నంద్యాల నుంచి కర్నూలు/ కడప బోర్డర్ సెక్షన్ వరకు 62 కి.మీ జాతీయ రహదారి
4)వేంపల్లి నుంచి చాగలమర్రి సెక్షన్ వరకు 78.95 కి.మీ జాతీయ రహదారి
5)గోరంట్ల నుంచి హిందుపూర్ సెక్షన్ వరకు 33.58 కి.మీ జాతీయ రహదారి
6)ముద్దనూరు నుంచి బి. కొత్తపల్లి సెక్షన్ వరకు 56.5 కి.మీ జాతీయ రహదారి
7)పెందుర్తి నుంచి బవ్దరా సెక్షన్ వరకు 40.55 కి.మీ. జాతీయ రహదారి

అదే విధంగా ప్రతి ఏడాది సిఆర్ఐఎఫ్ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.350 కోట్లు మంజూరు చేయడం జరుగుతుందని, అయితే ఆ నిధులను రూ.500 కోట్లకు పెంచమని చేసిన తమ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రానికి రూ.500 కోట్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు & భవనాల శాఖకు చెందిన 31 రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయమని కోరుతూ కేంద్రానికి చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించి, సంబంధిత చర్యలను త్వరలోనే చేపట్టడం జరుగుతుంది హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం…

గత ప్రభుత్వం రహదారుల నిర్వహణపై అశ్రద్ద చూపడం వల్ల రాష్ట్రంలో పలు రహదారులు అద్వానంగా మారాయని, వాటిని ఇప్పడు పునరుద్దరించాలంటే అదిక మొత్తంలో రెండు రెట్లు మేర ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రహదారులపై గుంతలను కూడా పూడ్చే చర్యలు గత ప్రభుత్వం చేపట్టలేదని, అయితే ఆ గుంతలను పూడ్చేందుకై ప్రస్తుతం తమ ప్రభుత్వం రూ.290 కోట్ల మేరు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు.

ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో వర్షాకాలం తదుపరి నవంబరు నుండి రహదారుల గుంతలు అన్నీ పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టి గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామన్నారు. అదే విధంగా ఈ మద్య కాలంలో సంబవించిన వరదల వల్ల చాలా రహదారులు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్దరణకు రూ.186 కోట్ల మంజూరు చేస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

పిపిపి విదానం అద్యయనానికై గురజాత్ వెళుతున్న అధికారుల బృందం…

గజరాత్, అస్సామ్ తో పాటు పలు రాష్ట్రాల్లో రహదారుల నిర్వహణకు పిపిపి విదానాన్ని విజయవంతంగా అమలు పర్చడం జరుగుచున్నదన్నారు. ఆ విధానాన్ని అద్యయనం చేసి మన రాష్ట్రంలో కూడా అమలు పర్చాలనే లక్ష్యంతో ఈ నెల 23 మరియుట 24 తేదీల్లో తమతో పాటు అధికారుల బృందం గుజరాత్ వెళుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అద్యయన బృందం ఒక నివేదికను రూపొందించి రాష్ట్ర ముఖ్యమంత్రికి త్వరలోనే సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.