ధాన్యం కొనుగోళ్లలో రూ.950 కోట్ల కుంభకోణం

-‘యు’ ట్యాక్స్‌తో రైతులను దోచుకున్నారు
-రైస్‌ మిల్లర్లతో మంత్రి కుమ్మక్కయ్యారు
-ఇరిగేషన్‌ టోల్‌గేట్‌ త్వరలోనే బయటపెడతా
-బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: ధాన్యం కొనుగోళ్లలో రూ.950 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రెండు నుంచి నాలు గు కిలోలు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారు. క్వింటాకు 10 నుంచి 12 కిలోలు కొల్లగొడుతున్నారు. అధిక ధాన్యం జోకడం తో వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి. రూ.500 వందల కోట్లు వసూలు చేశారు. యూ ట్యాక్స్‌ వసూల్‌ చేస్తున్నారు. వంద కోట్లు కేసీ వేణుగోపాల్‌కు పంపించారు. సివిల్‌ సప్లై కమిషనర్‌ చౌహాన్‌కు వ్యవసాయం గురించి తెలియదు అనుకుంటున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కోరారు.

మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
రైస్‌ మిల్లర్లతో మంత్రి కుమ్మక్కు అయ్యారు. స్టాక్‌ రైస్‌ మిల్లర్ల దగ్గర ఉంటే వడ్డీ ప్రభుత్వం ఎందుకు కట్టాలి. మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రూ.450 కోట్లు రైస్‌ మిల్లర్లు ఇచ్చారు. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణం…యు ట్యాక్స్‌. మంత్రి గారి ఇరిగేషన్‌ టోల్‌ గేట్‌ తరవాత చెబుతా. పీడీఎస్‌ బియ్యం రీ సైక్లింగ్‌ చేసి అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదు…మంత్రి స్పందిస్తే ఆధారాలతో సహా బయటకు వస్తాయని తెలిపారు. సన్న వడ్లకే 500 బోనస్‌ అంటే కేసీఆర్‌ బాటలోనే ఈ ప్రభుత్వం పోతుందని, ప్రజానీకాన్ని మోసం చేస్తుందన్నారు. నా ప్రాంతానికి న్యాయం జరుగుతే చాలు అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుకుంటున్నారు ఇది అమానుషం. సన్న వడ్లు నల్గొం డలో మాత్రమే ఎక్కువ పండిస్తారు. తెలంగాణలో 95 శాతం దొడ్డు వడ్లే పండిస్తారు. సీఎం దీనిపై వెంటనే ఆలోచించాలి.. యు టర్న్‌ సీఎం కావొద్దని వ్యాఖ్యానించారు.