దేశంలో కాంగ్రెస్ గాలి

కార్యకర్తలే కాంగ్రెస్ కు బలమైన పునాది..
కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఏపీ లో అభివృద్ధి..
తెలంగాణ లో గెలుపు గ్యారంటీ..

– కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్

విజయవాడ : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది అని… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపడుతుంది అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ స్పష్టం చేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన cwc సభ్యులు డాక్టర్ ఎన్. రఘువీరా రెడ్డి తో కలిసి శనివారం విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ కు విచ్చేశారు. పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. దుశ్శాలువతో సన్మానించి, కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా అందజేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మాజీ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ల చిత్ర పటాలకు ముందుగా పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీలు అమలవుతాయని తేల్చి చెప్పారు. కష్టించి పని చేయాలని, నమ్మకం కోల్పోకుండా సమస్యలపై పోరాడాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే సమ న్యాయం జరిగే ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చి చెప్పారు.

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్, ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీ అధికారంలోకి వచ్చే సమయం దగ్గర పడింది అని చెప్పారు. ఎప్పుడు అనేది కార్యకర్తల చేతుల్లోనే ఉందని, కష్టించి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పక గుర్తింపు లభిస్తుంది అన్నారు. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు అన్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్న డీకే శివ కుమార్, హీరోలు జీరోలు… జీరోలు హీరోలు అవుతారన్నారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ది గొప్ప చరిత్ర అని, దేశ చరిత్రే.. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో గిడుగు రుద్రరాజు నేతృత్వంలో.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి జరుగుతుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ప్రశంసించారు. ఇటువంటి నాయకత్వంలో పార్టీ పునర్ వైభవం సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ వల్ల ఉపయోగం లేదని డీకే శివ కుమార్ తేల్చి చెప్పారు.

కేంద్రం సహాయం మీదే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రాంతీయ పార్టీలు అన్నీ కుటుంబ పార్టీలే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చరిత్రాత్మక అవసరం ఉందని ఆయన తెలిపారు.

ముందుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ గురించి పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కార్యకర్తలకు వివరిస్తూ… ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు mla గా గెలుపొందిన ఆయన పార్టీకి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఎన్నో ఒత్తిడులు ఎదురైనా పార్టీ కోసం బలంగా నిలబడ్డారని తెలిపారు. అనంతరం cwc సభ్యులు డాక్టర్ ఎన్. రఘువీరా రెడ్డి మాట్లాడుతూ… డీకే శివ కుమార్ కాంగ్రెస్ పార్టీకే పెద్ద ఆస్తి అన్నారు. పార్టీ పరంగా దేశంలో ఎక్కడ సమస్యలు ఉత్పన్నం అయినా… ట్రబుల్ షూటర్ లా వెళ్లి సమస్యలు పరిష్కరిస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పునర్జీవానికి ముఖ్య కారణం డీకే ని అన్నారు. కేంద్రం లోని బీజేపి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా… కాంగ్రెస్ కోసమే నిలబడ్డ గొప్ప వ్యక్తి అని చెప్పారు.

ముందుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్, cwc సభ్యులు డాక్టర్ ఎన్. రఘువీరా రెడ్డి, పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మ శ్రీ, రాకేష్ రెడ్డి, విజయవాడ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బుర్రా కిరణ్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి, నరసరావు పేట జిల్లా అధ్యక్షుడు అలగ్జాండర్ సుధాకర్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎమ్. శేఖర్ (బాబ్జి), మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, ఇతర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాలు, నగరాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.