ఆర్టీసీ బస్లో షర్మిల ప్రయాణం
మహిళలతో మాటామంతీ
అమ్మఒడి, ధరలపై ఆరా
సమస్యలు చెప్పిన మహిళా ప్రయాణీకులు
అన్ని రేట్లూ పెరిగాయని ఆవేదన
శ్రీకాకుళం :అన్న జగన్రెడ్డిపై యద్ధం ప్రకటించిన చెల్లి షర్మిల కార్యక్షేత్రంలోకి దిగేశారు. పీసీసీ చీఫ్గా ఆమె జనక్షేత్రంలోకి దిగారు. అందులో భాగంగా జనం సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వైవీసుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ చేశారు. డేట్.. టైం.. వాళ్లు చెప్పినా… సరే.. నన్ను చెప్పమన్నా… సరే.. వస్తా.. అంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని షర్మిల డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల కంచిలి దగ్గర ఆర్టీసీ బస్ ఎక్కారు. బస్లో ప్రయాణికులతో ముచ్చటించారు.
అమ్మఒడి అందుతుందా లేదా అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలను ఇళ్ల స్థలాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, అమ్మఒడి రావడం లేదని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, ఇప్పటికి ఆర్టీసీ చార్జీలు చాలాసార్లు పెంచారంటూ వారు షర్మిల వద్ద వాపోయారు. ‘షర్మిలమ్మా జగనన్న పాలనలో బత కలేకపోతున్నాం. ఏం తిటేట్లు లేదు. ఏం కొనేట్లు లేదు. అన్ని రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోడ్లు ఎట్లా ఉన్నాయో మీరే చూడండి. మా గ్రామాల్లో ఇంకా దారుణంగా ఉంటాయి. ఓసారి వచ్చి చూడండి’ అని పలువురు మహిళలు తమ సమస్యలు షర్మిల వద్ద ఏకరవు పెట్టుకున్నారు.