ఇఫ్తార్ విందులో పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, మహానాడు: మత విశ్వాసానికి ప్రతీక రంజాన్ అని, ఖురాన్ ఆవిర్భవించిన ఈ పవిత్ర మాసాన్ని రంజాన్ గా ప్రవక్త ఆదేశానుసారం కఠిన ఉపవాస దీక్షలను అవలంబించడం ముస్లింల గొప్పతనమని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్ హాలులో సోమవారం సాయంత్రం గుంటూరు నియోజకవర్గ ముస్లిం సోదరుల ఇఫ్తార్ ధావత్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ముస్లిం సోదరులతో కలిసి రోజా విరమణ, నమాజ్, దువా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో ఖురాన్ గురించి తాను మూడు విషయాలు తెలుసుకున్నానన్నారు. అవి ఓర్పు, సహనం, దాన గుణం, కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేయడం అని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. వారి వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.