వచ్చే ఐదేళ్లు నగరంలో తాగునీటి సమస్య ఉండదు

వైసీపీ నాయకుల మేతతో ప్రజలు విసిగిపోయారు
అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిధులు బొక్కారు
నెలవారీ వసూళ్లలో ‘విడదల’ అవినీతి పర్వం
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌
పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం

గుంటూరు, మహానాడు: గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని ప్రజలకు రాబోయే ఐదేళ్లలో నీటి సమస్య ఉండదు. ఇది పెమ్మసాని హామీ. సాధారణంగా పదేళ్లలో రావాల్సిన వ్యతిరేకతను రజనీ మూడేళ్లలోనే మూట గట్టుకున్నారు. అందుకే నియోజకవర్గం నుంచి పారిపోయి గుంటూరుకు చేరారు అని గుం టూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. నగరంలోని పశ్చిమ నియో జకవర్గం 39వ డివిజన్‌లో అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవితో కలిసి మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతాజీ నగర్‌, ఉద్యోగ నగర్‌, క్రాంతి నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలు స్పందిస్తూ నిత్యం తాగునీరు అందడం లేదని, పారుదల లేని డ్రైనేజీ, మురుగుతో నిండిపోయిన సైడ్‌ కాలువల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నామని పెమ్మసాని ముందు వాపోయారు.

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో అవినీతి బయటపెడతా

ఆయన స్పందిస్తూ 2014-19 మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందిన నిధుల ద్వారా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు మొదలయ్యాయని, అయితే మధ్యలో అవినీతి అధికా రులు, నాయకుల కారణంగా ఆ పనులు అటకెక్కాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులను కొందరి అకౌంట్లకు మళ్ళించే ప్రయత్నాలు జరిగాయని, ఎన్నికల తర్వాత పూర్తి వివరాలు బయటపెడతానని స్పష్టం చేశారు. గుంటూరులో ప్రస్తుతం పేరుకుపోయిన నీటి సమస్యల పరిష్కారం కోసం కొత్తగా నిధులు తేవాల్సిన పనిలేదని, అందుబాటులో ఉన్న సాంకేతికతను, సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలిగితే చాలన్నారు. రాబోయే 8-10 నెలల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించేలా చూస్తానని తెలిపారు.

అవినీతి సొమ్ముతో ఆమె రాజకీయాలు

వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని రజినీపై మూడేళ్లకే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయని, ఆ కారణంతోనే మూడేళ్లకే చిలకలూరిపేట నియోజకవర్గం విడిచిపెట్టి గుంటూరుకు చేరుకు న్నారని పెమ్మసాని తెలిపారు. కేబుల్‌ టీవీ, గ్రానైట్‌, రేషన్‌, అక్రమ కట్టడాలు, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు.. ఇలా కనపడ్డ ప్రతి రంగం నుంచి నెల నెలా లక్షలకు లక్షలు అక్రమం గా వసూలు చేస్తున్నారని విమర్శించారు. అలా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఫ్లెక్సీలు, వేయించి రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఆ నాయకురాలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

30 ఏళ్లు వెనక్కి రాష్ట్రం: గళ్లా మాధవి

రాష్ట్రంలో జరుగుతున్న అసమర్థ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్‌ 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తమ ఇల్లు, వాకిళ్లు వదులుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ దుర్మార్గపు పరిస్థితి నుంచి మార్పు తీసుకురావాలి. పరిశ్రమలను తీసుకువచ్చి ఉద్యోగావకాశాలను కల్పిం చాలి. ఈ పర్యటనలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్‌యాదవ్‌, ఉగ్గిరాల సీతారామయ్య, ముస్లిం నాయకులు సయ్యద్‌ ముజీబ్‌, బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, 42వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేములపల్లి శ్రీనివాసరావు(బుజ్జి), 39వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ షేక్‌ రుస్తుం బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.