కడప ప్రజలకు సమాధానం చెప్పు జగన్
మైదుకూరు బహిరంగ సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి
మైదుకూరు, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో శుక్రవారం జరిగిన భారీ బహిరంగ సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఆమెతో పాటు సునీతారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమం త్రి పదవి అడ్డుపెట్టి మరీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని అన్నారు. సొంత బాబాయిని చంపించిన హంత కుల వెనుక ఎందుకు ఉన్నారు. కడప ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని కోరారు. ప్రజా కోర్టులోనే న్యాయం కోసం పోరాడుతున్నా. జగన్కు పాలన చేతకాలేదు.. తెలిసిందల్లా హత్యా రాజకీయాలేనని విమ ర్శించారు. పంచడానికి నా దగ్గర అవినీతి డబ్బు లేదు..ప్రేమ, ఆప్యాయత ఉంది. మైదుకూరు వైసీపీ అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లర్ అంట. మొత్తం మట్టి మాఫియా, ఇసుక మాఫియా..ప్రభుత్వ భూములు మొత్తం దోచేశా డట…ఆయన అవసరమా అని ప్రశ్నించారు. రాజోలి జలాశయం.. వైఎస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు… పూర్తయి ఉంటే లక్ష ఎకరాలకు సాగునీరు వచ్చేది.
కుందూనది నీళ్లను తెలుగు గంగకు పారిస్తా అన్నారట. జగన్ సిఎం అయ్యాక మళ్లీ ఒకసారి శంకుస్థాపన చేశారు తప్పితే తట్టెడు మట్టి తీయలేదు. హామీలు ఇచ్చి మోసం చేసే ఇలాంటి వాళ్లు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. న్యాయానికి, అన్యాయానికి జరుగున్న యుద్ధంలో కడప ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్ ఫొటో పెట్టుకునే హక్కు లేదు: సునీతారెడ్డి
జగన్కు వైఎస్ ఫొటో పెట్టుకునే హక్కు లేదు… షర్మిలకు మాత్రమే ఉందని వివేకా కుమార్తె సునీతారెడ్డి అన్నా రు. ఆమె నిజమైన వైఎస్ వారసురాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. షర్మిల గెలిస్తే వివేకాకు నిజమైన నివాళి అన్నారు.