ఉమ్మడి రాజధానికి కుట్రలు చేస్తున్నారు

తెలంగాణ తలరాతను మార్చే ఎన్నికలవి
మాజీ మంత్రి హరీష్‌రావు

కరీంనగర్‌, మహానాడు: కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా హుస్నాబాద్‌ నియోజకవర్గం అక్కంపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును, తలరాతను మార్చే ఎన్నికలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. వాళ్ల ఆటలు సాగకూడదనుకుంటే బీఆర్‌ఎస్‌’ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీల్లో ఒకటే అమలు చేసి ఐదు అమలు చేశామని అబద్ధం చెబుతున్నారు. అన్నవస్త్రం కోసమే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది. చెక్‌ బౌన్స్‌ అయితే శిక్ష పడుతుంది. కాంగ్రెస్‌ బాండు పేపర్లు బౌన్స్‌ అయ్యాయి. కాంగ్రెస్‌కు శిక్ష పడి తీరుందన్నారు. రేవంత్‌ ఇప్పుడు సిగ్గులేకుండా దేవుడిపై ఒట్టు పెట్టి మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ వచ్చాక అన్నీ గోవిందా గోవిందా పాటలా మారాయని ఎద్దేవా చేశారు.