ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విన్నపం

సామవేదం షణ్ముఖశర్మ

ఇది ఎన్నికల సమయం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి కానీ, ప్రపంచ వ్యాప్త పరిణామాలు గమనిస్తే ఈ ఎన్నికలు మరీ కీలకం. దేశ భవితవ్యాన్ని, ప్రజాస్వామ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడు స్పందించవలసిన తరుణమిది.

ఎండలెక్కువగా ఉన్నాయనో, ఎవరు ఎన్నికైతే మనకేమనే ఉదాసీనత చేతనో, నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమైంది అనే భావన చేతనో, బద్ధకం చేతనో ఇంట్లో కూర్చోకుండా దేశం పట్ల బాధ్యతతో ఓటు వేయడం ప్రతిఒక్కరి కర్తవ్యం. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో చాలామటుకు వంద శాతం ఓటింగ్‌ జరుగుతుంది. ఓటు వేయకపోతే జరిమానాలు కూడా వేసే ఉదంతాలు ఉన్నాయి. ఇంకా మన దేశంలో ఆ చైతన్యం పూర్తి స్థాయిలో జాగృతం కావడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఉచితాల ప్రలోభాలకు లొంగిపోయే పౌరుల బలహీనతను ఆసరాగా తీసుకొని అవినీతి నాయకులు దూసుకుపోతున్నారు. వారు తమ ఆస్తులను ప్రజలకు పంచడం లేదు. ప్రజా ధనాన్ని ఎరవేసి మోసగిస్తారు అని కూడా తెలుసుకోలేని ప్రజలున్న దేశమిది.

మరోవైపు ఓటు బ్యాంకులను తృప్తి పరచడం కోసం ఒక మతం వారికే ఈ దేశం సంపదను పంచిపెడతామని రాజ్యాంగ విరుద్ధంగా హామీలు కూడా ఇవ్వడం జరుగుతోంది. దేశం, భద్రత, అభివృద్ధి ఇలాంటివేవీ పట్టించుకోకుండా మత వ్యాప్తి కోసం, మతాధిక్యం కోసం మూకుమ్మడిగా విజృంభిస్తూ ఇతర దేశాలలో వాసులుగా, భారతీయ పౌరులుగా ఉన్న తమ మతం వారిని ఈ దేశంలోకి ఈ సందర్భంలో రప్పిస్తూ ఓటును వినియోగించుకుంటున్న మతవాదులకు, వేర్పాటువాదులకు ఇక్కడ కొదవ లేదు. వారికి దేశాభ్యుదయం, ప్రతి ఒక్కరి క్షేమం, అభివృద్ధి వంటివి పట్టవు. వారు దేశాన్ని దెబ్బతీసి స్వార్థపరులతో చేతులు కలపడానికి కూడా వెనుకాడరు. అలాంటి వారి శాతం పెరుగుతూ ఉంటే దేశ హితాన్ని కోరేవారు ఉపేక్షించడం ప్రమాదకరం.

ఎవరి పాలనలో ఈ దేశం సర్వతోముఖంగా అభ్యుదయ పథంలో ప్రయాణం చేస్తోందో, ఉగ్రవాద తీవ్రవాద వేర్పాటువాదాలను అణచివేయబడుతున్నాయో, ఎవరి నేతృత్యంలో శత్రు దేశాల నుంచి ప్రమాదం లేని భద్రత రక్షణ మనకు లభిస్తున్నాయో, కుల మత వివక్ష లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయో, ఎవరి ఏలుబడిలో సాంకేతికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా స్వయం ప్రతిపత్తితో ప్రపంచ దేశాలలో మన దేశానికి గౌరవ ప్రతిష్ఠలు లభిస్తున్నాయో, ఎవరి నాయకత్వంలో అగ్రరాజ్య స్థాయి వైపు పురోగమిస్తున్నామో, అందరితో కలిసి అందరి వికాసానికి పాటుపడే అంకితభావం గోచరిస్తోందో, విద్య, విద్యుత్‌, సంపద కొదవ లేకుండా ఎవరి పాలన సాగిందో, అవినీతిని నియంత్రించే నైతికత ప్రత్యక్షమవుతోందో అటువంటి మహనీయ నాయకు లు మళ్లీ మళ్లీ ఈ దేశాన్ని పాలించాలనే సంకల్పం ప్రతిఒక్కరిలో కలగాలి, కదలాలి.

వంచనలకు, ప్రలోభాలకు, తాత్కాలిక ఉచిత ఫలాలకు ఆశపడితే శాశ్వత ప్రయోజనాలకు దూరమవుతాం. బద్దకంతో ఇల్లు కదలకపోతే మనమే నష్టపోతాం. దేశ సముజ్జ్వల భవిష్యత్తుతో పురోగమించాలంటే, పారులందరి జీవితాలు సౌఖ్యంగా సౌకర్యంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ ఓటు వేయాలి. ఇళ్ల నుంచి కదలాలి. ఐదేళ్లలో ఒక్కరోజు మనం కేటాయిస్తే కొన్ని పదుల సంవత్సరాల వరకూ కూడా దేశ భవిష్యత్తుకు ఇక వెనక్కు చూడవలసిన అవసరం లేదు. విచక్షణ, వివేకం, సమగ్ర దేశాభ్యుదయం, ఈ దేశం సంస్కృతి రక్షింపబడాలనే భావం ప్రతిఒక్క పౌరునికి ఉండాలి. ఓటుహక్కు ఉన్న ప్రతి వారు ఇందులో పాల్గొనాలి.

అదే సమయంలో విదేశాలలో స్థిరపడ్డ మనవారు ఏమి చేయాలన్న ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. విదేశాలలో ఇంకా భారతీయ పౌరసత్యం కోల్పోకుండా వర్క్‌ వీసా మీద పనిచేసే వారైతే వీలైతే భారత దేశాని కి వచ్చి ఓటు చేయడం చాలా ముఖ్యమైన కర్తవ్యం. అలా రాలేని పక్షంలో దూరాభారాల వల్ల కానట్లయితే మరొక పనిచేయవచ్చు. అక్కడున్న మనవారు, అలాగే విదేశీ పౌరసత్వం తీసుకున్న భారతీయులు దేశభక్తి ఉంటే అక్కడి నుంచే ఈ దేశంలో ఉన్న తమ బంధుమిత్రులను ప్రేరేపించి వారు ఇల్లు కదిలి ఓటు వేయడానికి తగిన స్ఫూర్తినివ్వాలి.

అదేవిధంగా దేశం, ధర్మం రక్షింపబడాలి. దేశీయతా భావం, జాతీయతా భావం, దేశ భక్తి భావం ఉండాలి, అటువంటి నేతృత్వం రావాలి అనే భావం అందరిలో కలిగించాలి. ఈ విధంగా ప్రతిఒక్కరూ ఈ సమయంలో ఉద్యమించి ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఎక్కువ శాతంలో మన తెలుగు రాష్ట్రాలలో ఓటింగ్‌ జరగాలి అని కోరుకుందాం. అంతేకాదు ఓటర్ల జాబితాలో మన పేరు గల్లంతైతే ఉపేక్షించకుండా వెనుతిరిగి వచ్చేయ కుండా సంబంధిత ఎన్నికల కమిషన్‌ అధికారులకు తప్పకుండా ఫిర్యాదు చేయాలి. ఓటు మన హక్కు అది మనం వినియోగించుకోవాలి. మన స్వేచ్ఛను ఎవరు హరించినా ఊరుకోకూడదు. అదే విధంగా మనం ఎన్నికల రోజు తొందరగానే వెళ్లి ఓటు వేయాలని నిర్ణయించుకోవాలి. ఆలస్యం చేయకుండా పొద్దున్న లేచాక ఎంత తొందరగా ఓటు వేస్తామా అని అదొక ప్రధానమైన దైవ కార్యక్రమంలా చేయాలి. ఈ విధంగా మనం అత్యంత శ్రద్ధతో ఓటు వేసినట్లయితే దేశం భవిష్యత్తు చాలా బాగుంటుంది. సరైన ధర్మబద్ధమైన, న్యాయ బద్ధమైన అభ్యుదయ దృష్టి కలిగిన పాలన రావాలని పరమేశ్వరుని ప్రార్థిద్దాం.

ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు
వందే భారతమాతరం. భారత్‌ మాతా కీ జయ్‌…ధన్యోస్మి