అరాచక పాలనకు ముగింపు పలకండి

– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి

కూటమి అభ్యర్థుల గెలుపు ఏపీకి చాలా అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. శనివారం పూర్ణానందం పేట, పెజ్జోని పేటలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థులు గెలుపు ఏపీకి చాలా అవసరమని, ప్రజలందరిలో మార్పు రావాలన్నారు.

గత ఎన్నికల్లో జగన్ ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చి మోసం చేశారన్నారు. మరల అమలు కాని వాగ్దానాలు ఇచ్చి అధికారం చేపట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వైసీపీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, అమరావతి రాజధాని నిర్మాణం జరగాలన్నా, ఏపీ అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్నారు. వచ్చే వారం రోజులు కీలకమని ప్రజలంతా ఐక్యంగా కలిసి ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు.

జగన్ అరాచక పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధం అవ్వాలన్నారు. ప్రచారంలో సుజనా వెంట టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకుడు పైలా సోమినాయుడు, జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, 35 డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బూదాల నందకుమార్, జనసేన డివిజన్ అధ్యక్షుడు నారాయణస్వామి, ప్రదీప్ రాజ్, బీజేపీ మండల అధ్యక్షుడు క్యానం హనుమంతరావు, బీజేపీ మహిళా ఇన్ చార్జ్ ఆనందకుమారి, నాగలక్ష్మి, రౌతు రమ్యప్రియ, లింగాల అనిల్ కుమార్ కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రైల్వే గ్రౌండ్స్ లో వాకర్స్ తో సుజనా మాటా మంతి
పశ్చిమ నియోజకవర్గ ప్రజల స్థితిగతులను తెలుసుకుంటూ మౌలిక వసతుల ప్రాధాన్యమె ధ్యేయంగా పనిచేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే గ్రౌండ్ వాకర్స్ తో ముచ్చటించారు. వారి సమస్యలను సలహాలను స్వీకరించారు. మే13 న జరగనున్న ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.