దాడులకు గురైన బాధితులకు న్యాయం చేస్తాం
జైలు తప్పించుకునేందుకే జగన్ విదేశీ యాత్ర
టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ
గుంటూరు : జగన్రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు మంచి రోజులు రానున్నాయని టీడీపీ గుంటూరు జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలే ప్రభుత్వాన్ని కూల్చబోతు న్నాయని అన్నారు. నష్టపోయిన రాష్ట్రం బాగుపడి యథాస్థితికి చేరుకోవాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. విదేశాలకు పారిపోయిన జగన్రెడ్డి తీరు చూస్తుంటే మరలా స్వదేశానికి తిరిగి వచ్చేలా కనిపించడం లేదని, జైలు జీవితం తప్పించుకోవాలని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు, అనంతరం జే-గ్యాంగ్ చేసిన దాడుల్లో దళిత, గిరిజనులే బలయ్యారు. దాడులకు పాల్పడ్డ వారిని న్యాయస్థానాల ముందు నిలబెడుతామని, రాబోయే ప్రభుత్వంలో న్యాయం చేస్తామని తెలిపారు.