ఓట్ల నాడు ఒక మాట…నాట్ల నాడు మరోమాటా?
ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం
ప్రజాపాలన కాదు..రైతు వ్యతిరేక పాలన
కాంగ్రెస్ సర్కారుకు కౌంట్డౌన్ మొదలైంది
ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, మహానాడు : గ్యారంటీ కార్డులో వరి పంటకు రూ.500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా రైతులపై రేవంత్రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ఆయన స్పందించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా? ఇది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని ధ్వజమెత్తారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక చావగొట్టారు..కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు..కష్టించి పండిరచిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు.. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా అన్నారు..ఇవ్వలేదు.
వ్యవసా య కూలీలకు రూ.12 వేలు వేయలేదు. ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు. ఓట్ల నాడు ఒకమాట…నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. కాంగ్రెస్ సర్కారు ఎద్దేడ్సిన యవుసం..రైతేడ్చిన రాజ్యం నిలబడదు. నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు..పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు..కపట కాంగ్రెస్పై సమర శంఖం పూరిస్తారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు.