– నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీ జయకేతనం
– 1985 తర్వాత ఇన్నేళ్లకు విజయంతో రికార్డ్
– ఓడిన చోటే పోరాడి గెలిచిన యువనేత
మంగళగిరి: ఎన్నాళ్లకు..ఎన్నేళ్లకు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు పిలుపు వినపడి… పసుపుజెండా విజయగర్వంతో ఎగిరింది. 39 ఏళ్ల తర్వాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప లాడిరది. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యువనేత నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తరువాత 1983, 1985 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. అప్పటినుంచి మంగళగిరి నియోజకవర్గం పొత్తులతో కొన్నాళ్లు, పట్టుచిక్కక కొన్నాళ్లు అందని నియోజకవర్గం అయింది. ఆ తరువాత 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గోలి వీరాంజనేయులు, 1994లో సీపీఎం నుంచి ఎన్.రామమోహనరావు, 1999, 2004లో కాంగ్రెస్ నుంచి మురుగుడు హనుమంతరావు, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కాండ్రు కమల, 2014, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. మంగళగిరి నియోజకవర్గం టీడీపీకి అందని ద్రాక్షలా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుగా ప్రకటించినట్టుగానే మంగళగిరి నియో జకవర్గాన్ని కైవసం చేసుకుని మాట నిలబెట్టుకున్నారు. 39 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినపడని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి సంచలనం సృష్టించారు. తెలుగుదేశం జెండా ఎగురవేయడమే తన లక్ష్యమంటూ ప్రతినబూని మరీ అహర్నిశలు కష్టపడి ప్రజల మనస్సులు గెలుచుకుని విజేతగా సరికొత్త చరిత్ర సృష్టించారు.