పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం

అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న కంచన్‌జుంఘా ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ రైలుని ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. న్యూ జల్‌పాయ్‌గురికి సమీపంలోని రంగపాణి స్టేషన్‌కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి ప్యాసింజర్ రైలుని ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారని, 20-25 మంది గాయపడ్డారని డార్జిలింగ్ జిల్లా పోలీసు అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు.

ఈ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు. డాక్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆమె తెలిపారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి ఇప్పుడే తెలిసిందని, ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు.