– మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ విజ్ఞప్తి
తాడేపల్లి: లద్దాఖ్లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
దేశ రక్షణలో వీరి సేవలు చిరస్మరణీయమన్నారు. వారి త్యాగాలు మరువలేనివన్నారు. కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. మరణించిన జవాన్ల కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైయస్సార్సీపీ నాయకులు వీరి అంత్యక్రియల్లో పాల్గొనాలని, వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని వైయస్.జగన్ ఆదేశించారు.