నంద్యాలను టూరిజం హబ్ గా చేస్తాం

చిన్న చెరువు పార్కు, టూరిస్ట్ రెస్టారెంట్ ను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్

నంద్యాల, మహానాడు:  నంద్యాలలోని చిన్న చెరువు గట్టుపై టూరిస్ట్ రెస్టారెంట్, చిన్న చెరువు పార్కును రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తదితరులు ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ చక్కటి లొకేషన్ లో చిన్న చెరువు కట్టపై పార్కును అభివృద్ధి చేసి ఆకర్షించే రీతిలో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. చిన్న పార్క్ లో రెస్టారెంట్ బిల్డింగ్ పునర్నిర్మాణ పనులు, చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించిన పరికరాలు, అవుట్డోర్ జిమ్, ల్యాండ్ స్కేపింగ్, వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ ప్రమాద నివారణ నిమిత్తం ఏర్పాటు చేసే ఐరన్ రక్షణ ఫెన్సింగ్, ఫుడ్ కౌంటర్ తదితర ఏర్పాట్లు ప్రజలందరూ ఆకర్షించే రీతిలో ఉన్నాయన్నారు. చెరువులో బోటింగ్ చేసేందుకు వీలుగా మోటార్ బోట్లు, ఫెడల్ బోట్ల నిర్వహణను మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర పర్యాటక, సినిమాటో గ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చిన్న చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పాటు నంద్యాల చుట్టూ ఉన్న శైవ క్షేత్రాలన్నింటినీ కూడ అభివృద్ధి చేసి జిల్లాను ఏపీ టూరిజం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పంచారామాలు ఎలా ఉన్నాయో… ఈ ప్రాంతంలో నవనందులు కూడా అలాగే ఉన్నాయని వాటన్నింటినీ అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చి నంద్యాల జిల్లాను టూరిజం సర్క్యూట్ గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. జిల్లాలో శైవ క్షేత్రాలు అధికంగా ఉన్నందున వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి తిరుపతి, శ్రీకాళహస్తి తరహాలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.

జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటూ నంద్యాలను టూరిజం హబ్ గా తయారు చేస్తామని మంత్రి వివరించారు నిధుల సమీకరణకు ఇబ్బంది లేదని ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యం చేసుకొని రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని… వారందరినీ ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా మారుస్తామని మంత్రి తెలిపారు. అటవీ, దేవాదాయ, పర్యాటకం సంయుక్తంగా సమీకృత ప్రణాళిక తయారుచేసి అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్డీవో మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.