డ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్

రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధి 
– మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మహానాడు :  డ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చర్యలు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్ సంబంధిత ఔషధాలు కొన్ని మెడికల్ షాపులలో బయటపడుతున్నాయన్న ఎమ్మెల్యేల పిర్యాదుతో తక్షణమే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగర ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోపు నగర అభివృద్ధి, పలు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ,బడ్జెట్ లో నగరానికి కావాల్సిన అవసరాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…

శాసన సభ బడ్జెట్ సమావేశాల్లోపు రాజకీయాలకు అతీతంగా నగర ఎమ్మేల్యేలు ,ఎమ్మెల్సీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిసి నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ బిల్లులు , నగరంలో జరుగుతున్న ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ  పనుల పురోగతి తదితర అంశాలపై విజ్ఞప్తి చేయాలని సమావేశంలో చర్చించారు.. నగరంలో డెంగ్యూ కేసులు రాకుండా వైద్యాధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నీళ్ళు నిల్వ ఉండకుండా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ ,హెచ్ఎండిఎ, వాటర్ వర్క్స్ , ఎలక్ట్రిసిటీ పలు సమస్యలు, పెండింగ్ బిల్స్, ప్రస్తుతం వర్క్స్ కి అవసరమైన నిధులు కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని తెలిపారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా చర్యలు

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ పై తీసుకుంటున్న చర్యలు ,లా అండ్ ఆర్డర్ పై హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నగరంలో గురుకులాలు ,ప్రభుత్వ హాస్టల్ లు , స్కూల్ లు  తదితర వాటిపై ఎమ్మేల్యేలు అధికారులు తనిఖీ చేపట్టాలని కోరారు. అప్పుడే విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వగలమని సూచించారు. నగరంలో స్కూల్ లలో ఉన్న పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.  పాఠశాలలో తాగు నీటి సమస్యలు లేకుండా చూడాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అధికారులను ఆదేశించారు. అన్నిటినీ క్రోడీకరించి హైదరాబాద్ అభివృద్ధి పై ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమెజ్ తగ్గకుండా మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

సమీక్షా సమావేశంలో భాగంగా నగర ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యల పై మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిపై వెంటనే అధికారులతో మాట్లాడి అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశించారు. కంటోన్మెంట్లో నీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యే గణేష్ మంత్రి దృష్టికి తీసుకురాగా దానిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇతర అంశాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కారం చేసుకుందామని హామీ ఇచ్చారు. అధికారులు వారి డిపార్ట్మెంట్లలో తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు జీహెచ్ఎంసీ ,హైదరాబాద్  లా అండ్ ఆర్డర్,వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ  తదితర అంశాలపై అధికారులు చర్చించారు.

సమావేశంలో నగర ఎమ్మెల్యేలు గణేష్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎంఐఎం ఎమ్మేల్యేలు మహమ్మద్ ముబిన్, కౌసర్ మోహినుద్దీన్, అబ్దుల్లా బలాల , మాజిద్ హుస్సేన్ ,జాఫర్ హుస్సేన్  ఎమ్మెల్సీలు బలమూరి వెంకట్, ప్రభాకర్ రావు, మీర్జా రియాజ్ ఉల్ హుస్సేన్ ఎఫండి ,మీర్జా రహమాన్  తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హెచ్ డబ్ల్యూఎమ్ఎస్ అశోక్ రెడ్డి , సీడీపీసీఎల్ ఎండీ ముస్తఫా, అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ vs మాన్, అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్షన్ష్ యాదవ్ వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.