రెవెన్యూ రికార్డుల దగ్ధం వెనుక వైకాపా నేతల హస్తం

తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు

మదనపల్లి, మహానాడు : మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దగ్ధం వెనుక వైకాపా నేతల హస్తం ఉందని తెదేపా జిల్లా అధ్యక్షుడు  చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. 

మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం  భూదందాలకు పాల్పడింది. వారి అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చే సమయంలో రికార్డులు దగ్ధం చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఐఏఎస్ అధికారిని సబ్ కలెక్టర్ గా నియమించడంతోనే దుండగులు ఈ దురాగతానికీ పాల్పడ్డారన్నారు. రికార్డులు దగ్ధం కావడానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ ఘటనపై ప్రభుత్వం సత్వర విచారణకు ఆదేశించిందన్నారు.

కీలకమైన తపాలా విభాగం, 22(ఎ) విభాగంలో రికార్డులు కాలి బూడిదయ్యాయి.  22(ఎ) విభాగంలో గౌతమ్ తేజ్ అనే అధికారి రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారు.గత ప్రభుత్వంలో ఈయనపైన అనేక ఆరోపణలున్నాయి. కాబట్టే ఉద్దేశ్యపూర్వకంగా అగ్నిప్రమాదం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఐదేళ్ల కిందట నిర్మించిన కొత్త భవనంలో మంటలు ఎలా వ్యాపించాయి. గత వైసిపి ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు.

ఘటన జరిగిన వెంటనే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్  ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లికి వచ్చి పరిశీలించారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలి. వైకాపా నేతల భూ అక్రమాలను వెలికి తీసి గత ప్రభుత్వ పాలకుల అక్రమాలను ప్రజా కోర్టు ముందు ఉంచుతామన్నారు.