హామీలు బారెడు నిధులు మాత్రం జానెడు 

తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ!
కౌలు రైతుల గోస పట్టించుకునే నాథుడే లేడు!
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి

హైదరాబాద్, మహానాడు : ఎన్నికల హామీలు బారెడు నిధులు మాత్రం జానెడు అనే విధంగా తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీగా మారిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. రుణ మాఫీకి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని చెప్పారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదు. సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారు. ఇందులో కోత విధించారు. ఏ ప్రాతిపాదికన రైతులను ఎంపిక చేశారని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్బంగా మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ… వరంగల్ సభలో ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని ఒప్పుకున్నారు. మెలికలు లేకుండా రుణమాఫీ చేయాలి. ఈ ఏడాది రైతు బంధు పడలేదు. సీజన్ రైతు బంధు విడుదల చేయాలి. రైతు బంధుకు , రైతు భరోసా కు వేర్వేరు నిధులు కేటాయించాలి. రైతు భరోసా పై అసెంబ్లీలో చర్చ పెడతామని సీఎం చెప్పారు. చర్చ ఎప్పుడు పెడతారో చెప్పాలి.

కౌలు రైతుల గోస పట్టించుకునే నాథుడే లేడు.

తెలంగాణలో దాదాపు 15 లక్షల కౌలు రైతులు ఉన్నారు. వారు మీరిచ్చిన హామీతో మీకు ఓటేశారు. కౌలు రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సహాయం ఇచ్చి ఆదుకోవాలి. పంట బోనస్ 500 ఇవ్వాలి. వ్యవసాయానికి  49 వేల కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో 31 వేల కోట్ల ఇచ్చారు. కేసీఆర్ మాదిరిగానే సన్న బియ్యంకు బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటిలోగా ఇస్తారు? రాష్ట్రంలో 7 నెలల్లో 150  మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వం రైతులను విస్మరించింది. అందుకే అక్కడ కూర్చున్నారు.

భూమాత పోర్టల్ వచ్చేది ఎప్పుడు?

భూ సర్వే తో నష్టపోయిన ఎంత మందికి మీరు న్యాయం చేశారు? రెవెన్యూ ట్రిబ్యునల్ కసరత్తు మొదలైందా? పేదల భూములు కేసీఆర్ లాక్కున్నారని, ఆ భూములు వెనక్కి తీసుకొని న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాటేమిటి ? గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు లక్షల ఎకరాలు దోచుకున్నారని ఆరోపణలు చేశారు ? ఆ లెక్క ఏమైనా తెలిసిందా? రాష్ట్రం ఏర్పడినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్ భూమి ఉండేది. ఇప్పుడు 5 లక్షల మాత్రమే ఉంది. అవి ఎవరు లాక్కున్నారు ? దాన్ని లెక్క ఏమైనా తెలిసిందా? దానిపై ఎంక్వైరీ ఏమైనా వేశారా? దీనిపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా?

కాళేశ్వరం స్కాం ను సీబీఐ ఎంక్వైరీ కి ఇచ్చేందుకు ఎందుకు వెనకడుగు  వేస్తున్నారు? ధరణి పోర్టల్ విదేశీ కంపెనీ ఆధీనంలో ఉంది. విదేశీ కంపెనీకి అప్పజెప్పెందుకు బాధ్యులు ఎవరు? దీనిపై ఇప్పటి వరకు విచారణ  చేయలేదు. దీని వెనకున్న మతలబు ఏమిటి? లక్షల ఎకరాల భూమిని బీఅర్ఎస్ బకాసురులు తింటే ఎందుకు ఎంక్వైరీ లేదు? ధరణి సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి

మంత్రి పొన్నం ప్రభాకర్ కు కౌంటర్ ఇస్తూ…

రెండు రోజుల క్రితం కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది అనేది వివరించాం. కేంద్రం ఇచ్చిన నిధుల మీద చర్చ కు నేను సిద్ధం. ధరణి లో జరిగిన అవినీతిపై విచారణ అడిగితే సబ్జెక్ట్ డీవియేట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య ఉన్న అవగాహన ఒప్పందం అర్థం అవుతుంది. మీతో కాకుంటే సీబీఐకి సిఫార్సు లేఖ రాయండి. 24 గంటల్లో సీబీఐ ఆమోదం తీసుకొచ్చే బాధ్యత మాది అని అన్నారు.