జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే!

– గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్

గుంటూరు, మహానాడు: జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్టుగా జగన్ వ్యహరిస్తున్నారని తెలుగుదేశంపార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆరోపించారు. అర్బన్ పార్టీ కార్యాలయం లో గురువారం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడరు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదని పేర్కొన్నారు. వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినా, తాము గౌరవిస్తున్నామన్నారు. అసెంబ్లీలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ హేళన చేశారన్నారు.

23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో కొంత మందిని లాగేస్తే ప్రతిపక్ష నేత హోదా పోతుందని జగన్ అనలేదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ప్రజలకు పంగనామాలు పెట్టిన జగన్‌కు, ఇచ్చిన మాట ప్రకారం హామీల అమలు చేస్తున్న చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. జగన్‌ను రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, ఆయన పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారన్నారు. ఓటమి నుంచి జగన్ రెడ్డి పాఠాలు నేర్చుకోవడం లేదన్నారు. జగన్ రెడ్డి తాను మళ్లీ సీఎం కుర్చీపైన కూర్చుంటానంటూ పగటి కలలు కంటున్నారన్నారు. వైసీపీ మునుగుతున్న నావ అని, ఇప్పుడు పూర్తిగా మునిగిపోయిందని పేర్కొన్నారు.