• ఎరువుల తూకాలు, ధరల్లో తేడాలు వద్దు
• కొత్త చట్టాలను అనుసరించండి
• రైతును మోసం చేస్తే ఉపేక్షించం
– పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ, మహానాడు: కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం… ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకితభావంతో పని చేస్తోంది.. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదార్లు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
యూరియా, డి.ఏ.పి., ఎరువులు, పురుగు మందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కొలతలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బరువు, ఎమ్మార్పీల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తూనికలు, కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ బి. రామ్ కుమార్ తూనికలు, కొలతల శాఖలో కొత్తగా వచ్చిన చట్టాలు, నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతన్న అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ నిర్వహించిన తనిఖీల్లో యూరియా, డీఏపీ ధరలు, కొలతల్లో తేడాలు, బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులకు ఇబ్బంది కలుగుతున్న విషయం దృష్టికి వచ్చింది.
252 కేసులు నమోదు
తూనికలు, కొలతల శాఖ నుంచి ఇటీవల క్షేత్ర స్థాయిలో చేపట్టిన తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 252 కేసులు నమోదు చేశాం. అందులో ఎక్కువ కేసులు కొలతల్లో తేడాలు ఉన్నాయని పెట్టినవే ఉన్నాయని మంత్రి మనోహర్ అన్నారు. రైతుని ఇబ్బంది పెట్టే విధంగా కొలతల్లో తేడాలు చేస్తే ఉపేక్షించేది లేదు. ఒక్కోచోట బస్తాకి రెండు, మూడు కేజీలు తేడాలు ఉంటున్నాయి. కొలతల విషయంలో తేడాలు ఉండకూడదు. ప్రతి బ్యాగు బరువు చూసి అమ్మాలి. మరికొన్ని అధిక ధరల వసూళ్లకు సంబంధించిన కేసులు ఉన్నాయి. రవాణాలో బరువు తగ్గితే ఉన్న కొలత లెక్క కట్టి దాని మేరకే ధర చెల్లించే ఏర్పాటు చేయాలి. ఎక్కడా రైతుకి మాత్రం ఇబ్బంది కలుగ కుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
గత ప్రభుత్వంలో రైతుకు ఇబ్బంది
గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎరువులు, విత్తనాల కొరత ప్రధానంగా రైతుని ఇబ్బందిపెట్టింది. ఈ ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెలా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించి రైతుల పక్షాన నిలబడతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయి. మారిన చట్టాలకు అనుగుణంగా అంతా ముందుకు వెళ్లాలి. కొత్తగా అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనను తయారీదార్లు కచ్చితంగా అమలు చేయాలి. అదే సమయంలో తయారీదార్లు క్షేత్ర స్థాయిలో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా దృష్టి సారించాలి. తయారీదార్లు, డీలర్లకి కొత్త చట్టాల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. రైతుకి భరోసా కల్పించకపోతే మనం తప్పు చేసిన వారిమవుతాం.
రైతు సంతోషమే మన సంతోషం
కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా వినియోగదారుడి పక్షాన నిలబడుతుంది. రైతు సంతోషంగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉంటామని మంత్రి అన్నారు. సరుకు కొరత వల్ల బ్లాక్ మార్కెట్ జరుగుతోందని చెబుతున్నారు. మనం మంచి చేయాలి అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు ధరల్ని నియంత్రించిన విధానం అందుకు ఉదాహరణ. కంది పప్పు కేజీ రూ.180 ఉన్నప్పుడు హోల్ సేలర్స్, రిటెయిలర్స్ తో సమావేశం ఏర్పాటు చేస్తే మొదట రూ.160కి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మరో రూ.10 తగ్గించి రూ.150కి కేజీ ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. తయారీదార్లు, డీలర్లు రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలి. ఖరీఫ్ సమయానికి మీ నుంచి సహకారం అవసరం. ఉద్దేశపూర్వకంగా ఎవరి మీదా కేసులుపెట్టం. ప్రభుత్వపరంగా చట్టానికి లోబడి ముందుకు వెళ్తాం. అంతా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రైతుని కాపాడుకుందాం అన్నారు.