ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నిరంతరాయంగా సురక్షిత నీరు

– జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
– మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది
– గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి : రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలి, ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిరంతరాయంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు.

వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాలపై సిఎం సమీక్ష చేశారు. 26 జిల్లాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని అందించాల్సి ఉంది, ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, అందువల్ల కేవలం 5 జిల్లాల్లో మాత్రమే 90 శాతానికి పైగా ట్యాప్ కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ….‘‘ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఎన్డీయే ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో పాటు నిధులు తీసుకురావడంలో కూడా ఘోరంగా విఫలమైంది. కేంద్రం ఇచ్చిన రూ.27,248 కోట్లలో వైసీపీ ప్రభుత్వం రూ.4235 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

ఇంకా 28 లక్షల ఇళ్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు బ్రహ్మాండంగా వినియోగించుకున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం కారణంగా పనులు ముందుకు సాగలేదు. తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఇక అడుగులు పడాలి. 2019కి ముందే పలు గ్రామాల్లో నిర్మాణమై ఉన్న ట్యాంకర్ల ద్వారా ట్యాప్ కనెక్షన్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేశాం.

కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. సురక్షిత తాగునీటిని ప్రతి ఇంటికీ నిరంతరం అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. సమీపంలోని రిజర్వాయర్ల నుండి గ్రామాలకు పైప్ లైన్లు ఏర్పాటు చేసి నిరంతర తాగునీరు సరఫరా అయ్యేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఇందుకోసం నీటి సామర్థ్యం, వినియోగంపై ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.

శాశ్వతంగా 95 లక్షల గృహాలకు నిరంతరం తాగునీరు అందించాలి, మిగతా 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి DPR సిద్ధం చేయండి. ఇందుకోసం అత్యున్నత స్థాయి కన్సల్టెంట్లను భాగస్వామ్యం చేయండి. సురక్షిత నీటితో పాటు వేగంగా సరఫరా అయ్యేలా, లీకేజీలను పర్యవేక్షించడానికి SCADA వంటి తాజా సాంకేతికతను ఉపయోగించాలి. పురోగతి లేని పనుల టెండర్లు రద్దు చేయాలి.

వైసీపీ ప్రభుత్వం తప్పిదాలే జల్ జీవన్ మిషన్ ఆలస్యానికి కారణం…ఆ తప్పులు సరిదిద్ది కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి నిధులు తీసుకొస్తాం. 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు అందించడం ప్రభుత్వ ప్రధాన టార్గెట్. గత ఐదేళ్లలో జల్ జీవన్ మిషన్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి ఉంటే ఈ పాటికే ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు అందేది. పనులు చేపట్టిన గుత్తేదారులు నిర్ణయించిన కాలానికి మెయింటెనెన్స్ చేయడంతో పాటు ఏలాంటి క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారో తనిఖీలు చేయాలి.

సాఫీగా సాగాల్సిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ కాంప్లికేట్ చేసింది. మళ్లీ 3 నెలల్లో పనులు పట్టాలెక్కించి పరుగుల పెట్టాలి.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అధికారులు పాల్గొన్నారు.