శారదా పీఠం పేరుతో ఎస్.ఎన్.పాల్ భూ కుంభకోణం

– పీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును తన ఆధీనంలోకి తీసుకున్నారు
– గెడ్డ స్థలంలో గోశాల ఏర్పాటు
– మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి
– 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
– ఆ 15 ఎకరాల భూమిని విశాఖలో పాత్రికేయులకు కేటాయించాలి
– జిల్లా కలెక్టర్ ఎన్.హరేందర్ ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఫిర్యాదు

విశాఖపట్నం: హిందూ వాదినని.. శారదా పీఠాధిపతిని అంటూ ప్రజలను మోసం చేస్తూ స్వరూపానందేంద్ర సరస్వతి పేరుతో చలామణి అవుతున్న ఎస్.ఎన్.పాల్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ పేర్కొంటున్నారు.
ఇదే అంశమై సోమవారం జిల్లా కలెక్టర్ ఎన్.హరేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. శారదా పీఠం పేరుతో ఎస్.ఎన్.పాల్ భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. శారదా పీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును, తన ఆధీనంలో కి తీసుకున్నారన్నారు. ఫలితంగా ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. మరో వైపు శారదా పీఠం గోశాలను గెడ్డ స్థలంలో నిర్మించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారాల పై విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్.ఎన్.పాల్ (స్వరూపానందేంద్ర సరస్వతి) వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారి, ఇష్టనుసారంగా వ్యవహరించారన్నారు. ఈ క్రమంలోనే భీమిలిలో 15 ఎకరాల భూమి కూడా సొంతం చేసుకున్నారని ప్రస్తావించారు.

ఏది ఏమైనా హిందూ మత ఉద్ధరణ కు పాటు పడతారనే ఉద్దేశ్యంతో, అతనికి గత ప్రభుత్వం భీమిలి లో కేటాయించిన 15 ఎకరాల భూమిని, కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు.

ఆ 15 ఎకరాల భూమిని విశాఖలో పాత్రికేయులకు కేటాయించాలన్నారు. గతంలో శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు వచ్చేవని తెలిపారు. ఆ నిధులతో దేవి శరన్నవరాత్రుల తో పాటు వివిధ కార్యకలాపాలను, అత్యంత వైభవోపేతంగా నిర్వహించేవారన్నారు.

అయితే వైసిపి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడడంతో, ఎస్.ఎన్.పాల్ నేతృత్వంలో కొనసాగుతున్న శారదా పీఠానికి నిధుల ప్రవాహం నిలిచి పోయిందన్నారు. ఇదే క్రమంలో ఎస్.ఎన్.పాల్ భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.కలెక్టర్ ఎన్.హరేంద్ర ప్రసాద్ ను కలిసిన వారిలో కోడే బాబురావు తదితరులు పాల్గొన్నారు.