ఎంతమంది నవ్వుతూ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లారనేది ముఖ్యం
వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత
వరంగల్ లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం
వరంగల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వరంగల్ : వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందింది.
ఫార్మారంగం ఎప్పుడు చర్చకు వచ్చినా అందులో హైదరాబాద్ కు స్థానం ఉంటుంది. ఇందుకు కారణం ఇందిరాగాంధీ దూర దృష్టి. రాజీవ్ గాంధీ చొరవతో తెలంగాణలో ఐటీ రంగం రాణించింది. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం.
రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శందాబాద్ లో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని రకాల వైద్య సేవలు అందించేలా మెడికల్ టూరిజం హబ్ ఉండాలి. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మా ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకు సాంకేతికంగా మీ సహాయం కోరుతున్నాం. ఆసుపత్రికి ఎంతమంది వచ్చారని కాదు.. ఎంతమంది నవ్వుతూ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లారనేది ముఖ్యం.వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత. డబ్బుల కోణంలో కాదు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేయాలి.
నగరానికి త్వరలో ఎయిర్ పోర్ట్ రాబోతోంది, టెక్స్టైల్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. వరంగల్ లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం.