– మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడ లో దెబ్బతిన్న భవానీ ఐల్యాండ్, బెరంపార్క్ తదితర పర్యాటక ప్రాంతాల్లో త్వరతగతిన పునరుద్దరణ చర్యలు చేపడతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విజయవాడ లోని బెరం పార్క్, భవానీ ఐల్యాండ్ కి మంగళవారం బోటులో వెళ్లిన మంత్రి.. అధికారులను అడిగి వరద నష్టంపై ఆరా తీశారు.
దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదల తాకిడికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లో దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాల్లో పునరుద్దరణ చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాల్లో నష్టం అంచనా వేస్తున్నామని త్వరలోనే నష్టంపై అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకొని చర్యలు చేపడుతామన్నారు. మళ్ళీ విజయవాడ లో పర్యాటకం పుంజుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు పర్యాటక శాఖ ఈడీ పద్మావతి, ఓఎస్డీ చైత్ర వర్షిణి, డివిఎం చైతన్య, ఏపీటీడీసీ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.