వైసీపీ పార్టీకి చెంపదెబ్బ

ఎమ్మెల్యే గళ్లా మాధవి   

గుంటూరు, మహానాడు: ఉచితంగా ఇసుక ఇస్తామన్న వాగ్దానాన్ని చంద్రబాబు అమలు చేయడం వైసీపీ పార్టీకి చెంపదెబ్బ మోగినట్లేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి సారించారన్నారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మాట్లాడటం చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు.

తనతోటి నాయకుడైన వల్లభనేని వంశీ కౌరవ సభలో చేసిన వ్యాఖ్యలు అయిదేళ్ళ తర్వాత మేయర్ కు గుర్తుకు రావడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నగర మేయర్ టీడీపీ డివిజన్లలో రోడ్లు వేయనీకుండా అడ్డుకొన్నారన్నారు. టీడీపీ ఫ్లెక్సీలు కూడా కట్టుకోలేని పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తారు. వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఆయన నిజంగా మనస్ఫూర్తిగా తప్పు పడితే, వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఆయన నిబద్ధత నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.