• గత ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది
• ఏడాదిలో పూర్తవ్వల్సిన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పదేళ్ళు వెనక్కి నెట్టింది
• పోలవరం సహా ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం
• కాలువలు,డ్రైన్లలో తూడు తొలగింపు,డీసిల్టింగ్ పనులకు తొలి దస్త్రంపై సంతకం
– రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి,20 జూన్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టు ఏడాది లోగా పూర్తి కావాల్సి ఉండగా గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి పదేళ్ళు వెనక్కి నెట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామా నాయుడు ఆరోపించారు.
గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గవ బ్లాకులో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా రామానాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ళ కాలంలో నీటి పారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు.ముఖ్యంగా ఏడాది వ్యవధిలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పదేళ్ళకు వెనక్కి నెట్టిందని ఆరోపించారు.
అదే విధంగా 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం రీఇంబర్సు మెంట్ కింద విడుదల చేసిన నిధులను వేరే అవసరాలకు మళ్ళించిందని అన్నారు.సియంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి క్షేత్ర స్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తోందని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం,అవినీతిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందని హైదరాబాదు ఐఐఐటి నీతి ఆయోగ్ కు నివేదిక ఇచ్చిందని తెలిపారు.
మరలా దానికి మరమ్మత్తులు చేయాలన్నా కనీసం 440 కోట్ల రూ.లు అవుతుందని ఒకవేళ కొత్తగా నిర్మించాలన్నా సుమారు 990 కోట్ల రూ.లకు పైగా వ్యయం అవుతుందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.దీనిపై సవివరంగా సమీక్షించి మరమ్మత్తులు చేయాలా లేక కొత్తగా నిర్మించాలా అనేదానిపై తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలోని రైతాంగానికి తక్షణ ఉప శమనం కలిగించేందుకు వీలుగా వివిధ ఏటిగట్లు పటిష్టీకరణ,షట్టర్లు,గేట్లు వంటివాటి మరమ్మత్తుల నిర్వహణ వాటి పటిష్టీకరణకు అధికారులకు ఆదేశాలిచ్చామని జలవనరుల శాఖమంత్రి రామానాయుడు చెప్పారు.
కాలువలు,డ్రైన్లలో గుర్రపు డెక్క,తూడు తొలగించేందుకు తగిన పనులు చేట్టేందుకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశామని అన్నారు.గత ప్రభుత్వం లాకులు,షట్టర్లకు మరమ్మత్తులు చేయలేదని కనీసం వాటికి గ్రీజు కూడా పూయలేదని మంత్రి రామానాయుడు ఆరోపించారు.
అంతకు ముందు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్,ఇఎన్సి నారాయణ రెడ్డి,జలవనరుల శాఖ సలహాదారు పూర్వపు ఇఎన్సి ఎం.వెంకటేశ్వరరావు,సిహెచ్.శ్రీధర్ ఇంకా పలువురు అధికారులు,ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.