– హింసతో ఏదీ సాధించలేం..
– జనజీవన స్రవంతిలో కలవండి… ఇది నా పిలుపు
– అనేక పథకాలు అమలవుతున్నాయి…
– వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి వచ్చేయండి…
– వికసిత్ భారత్ సాధించాలంటే ఆదివాసీలు భాగం కావాలి
– కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఢిల్లీ: వికసిత్ భారత్ సాధించాలంటే అందులో ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వ ఫలాలు వారికి చేరకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారని, రోడ్లు, టవర్లు, చివరకు విద్య, వైద్యం కూడా గిరిజన ఆదివాసీలకు చేరకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఏమన్నారంటే… గత కొన్నేళ్లలో మావోయిస్టు సమస్యను ఎదుర్కొనే విషయంలో గణనీయమైన పురోగతి సాధించాం.
2022లో తొలిసారి మావోయిస్టు హింస కారణంగా జరిగిన మరణాల సంఖ్య 100 కంటే తక్కువ నమోదైంది. మావోయిస్టుల ప్రభావిత గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు, పథకాలు కూడా వేగంగా చేరుతున్నాయి. బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ ఈ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో రాష్ట్రాల పోలీస్ విభాగాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. హెలికాప్టర్ సేవలను వారికి అదజేయడం వల్ల గాయపడ్డ భద్రతా బలగాలను సకాలంలో ఆస్పత్రికి చేర్చడం లేదా భూమార్గం ద్వారా చేరుకోలేని ప్రాంతాలకు బలగాలను చేర్చడం సాధ్యపడింది. ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో వామపక్ష ఉగ్రవాదంపై చాలా పైచేయి సాధించాం.
మావోయిస్టులకు కూడా పిలుపునిస్తున్నా.. హింసతో ఏదీ సాధించలేం. జనజీవన స్రవంతిలో కలవండి. ఇందుకోసం అనేక పథకాలు అమలవుతున్నాయి. వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి వచ్చేయండి. పోలీస్ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా బాగా పనిచేశాయి.