ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడుతా

ప్రజాసేవకు వారెప్పుడూ ముందుంటారు
వారి రక్షణ కోసం అట్రాసిటీ తరహా చట్టాలు అవసరం
సంఘం ప్రతినిధులతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌
పిఠాపురంలో నామినేషన్‌ తర్వాత సామాజికవర్గాలతో భేటీలు
ఇల్లు పూర్తయ్యాక అందరికీ అందుబాటులో ఉంటానని హామీ
వర్మను చట్టసభల్లో కూర్చోబెట్టే బాధ్యత తనదని వెల్లడి

పిఠాపురం, మహానాడు : జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ మంగళవారం పిఠాపురంలో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం వివిధ సామాజికవర్గాల వారితో సమావేశమయ్యారు. పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో భేటీ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ దేశం ఇంత బలంగా ఉందంటే ఆర్యవైశ్యుడైన మహాత్మాగాంధీ పోరాటం వల్లేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉందంటే అది ఆర్యవైశ్యుడైన పొట్టి శ్రీరాములు త్యాగఫలితమేనని కీర్తించారు. మీ బలం మీరు తెలుసుకోవాలని సూచించారు. ఒక రోజున రైలు నుంచి మహాత్మా గాంధీని గెంటేస్తే ఆయన మన దేశం నుంచి బ్రిటీష్‌ వారిని గెంటేశారు. ఆర్యవైశ్యుల బలం అలాంటిది. మీరు భయ పడకూడదు. పెనుకొండలో నేను వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయ ప్రారంభోత్సవానికి పిలిస్తే వెళ్లాను. ఆర్యవైశ్యులతో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. నా మిత్రుడు రమేశ్‌ ఇచ్చిన పుస్తకాలు చదివి నేను జ్ఞానం సంపాదించుకున్నాను.

రమేశ్‌ ఒక ఆర్యవైశ్యుడు. ప్రజాసేవ కోసం పాటుపడే వారిలో ఆర్యవైశ్యులు ముందుంటారు. మీరు సమాజం కోసం చేసే సేవలు నాకు తెలుసు. ఆర్యవైశ్యులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహా చట్టాలు తీసుకురావాలి అనుకుంటున్నాను. మీరు ఆత్మగౌరవాన్ని కోరుకుం టారని నాకు తెలుసు. వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మగౌరవం కోసం ఆత్మబలిదానం చేసు కుంది. ఆర్యవైశ్యులకు అలాంటి ఆత్మగౌరవాన్ని తీసుకువచ్చేందుకు పాటుపడతాను. ఇంతకు ముందు భీమవరం వెళ్లినప్పుడు మావూళ్లమ్మ తల్లికి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ఆర్యవైశ్యులు కోరారు. అంతేకాదు అక్కడి శ్రీపాద వల్లభస్వామి వారి సేవలో భాగస్వామ్యం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. మన ప్రభుత్వం వచ్చాక మీ కోరికను నెరవేర్చేలా చూస్తాను అని పవన్‌కళ్యాణ్‌ హామీ ఇచ్చారు.

వర్మను చట్టసభల్లో కూర్చోబెడతా

పవన్‌ అంతకుముందు టీడీపీ ఎస్సీ సెల్‌ నేతలతోనూ సమావేశమయ్యారు. పిఠాపురంలో తన ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ప్రతిఒక్కరూ వచ్చి తనను కలిసి సమస్యలు చెప్పుకునే ఏర్పాట్లు చేస్తానని ఈ సందర్భంగా వెల్లడిరచారు. ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో 11 మంది మహిళలు పాలుపంచుకుంటే అందులో ఒక దళిత మహిళ కూడా ఉందని, అప్పటి నుంచే దళిత మహిళలు చైతన్యవంతులయ్యారని వివరించారు. నేను జాషువా విశ్వ నరుడిని అర్థం చేసుకున్న వాడిని…తప్పకుండా దళితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్మ ఇక్కడ కార్యకర్తలను తయారు చేయలేదు…బలమైన నేతలను తయారుచేశారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధిలో మీ వంటి నాయకుల సేవలను తప్పకుండా ఉపయోగించుకుంటానని స్పష్టం చేశా రు. వర్మ ఎమ్మెల్యే అభ్యర్థి కాకపోయినా ఆయనకు గౌరవం ఇచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశా రు. ఆయనను చట్టసభల్లో కూర్చోబెట్టే బాధ్యత తీసుకుంటానని వెల్లడిరచారు.