వైఎస్సార్‌ను తిట్టిన బొత్స…నీకు తండ్రి సమానుడా?

విజయమ్మను సైతం అవమానించాడు..
ఆయన్ను దుమ్మెత్తిపోసిన వాళ్లకే పెద్దపీట వేశావ్‌
నిజమైన అభిమానులు పనికిరారా?
నీ కోసం పాదయాత్ర చేసిన వారు…
గొడ్డలిపోటుకు గురైన వారు ఏమీ కారు…
రేపల్లె సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు

రేపల్లె, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. పొద్దున పేపర్‌లో చూశా. బొత్స సత్యనారాయణ జగన్‌కి తండ్రి సమానులు అన్నారు. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోసిన వ్యక్తి. ఇదే బొత్స వైఎస్సార్‌ను తాగుబోతు అని తిట్టాడు. ఇదే బొత్స జగన్‌కు ఉరిశిక్ష వేయాలని అన్నాడు. జగన్‌ బినామీలు అన్నాడు. విజయమ్మను సైతం అవమానపరిచాడు. ఇలాంటి బొత్స జగన్‌కి తండ్రి సమానులు అయ్యారు. జగన్‌ క్యాబినెట్‌లో ఉన్న వాళ్లందరూ వైఎస్సార్‌ను తిట్టిన వాళ్లే… జగన్‌ వారికే పెద్దపీట వేశారు. నిజంగా ఆయన కోసం పని చేసిన వాళ్లు ఈయనకు ఏమీ కారు.

ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్లు ఏమీ కారు. ఆయన కోసం పనిచేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్లు ఏమీ కారు. వైసీపీ పార్టీ పేరులో వైఎస్సార్‌ లేడు. వై అంటే వై.వి.సుబ్బారెడ్డి, ఎస్‌ అంటే సాయిరెడ్డి, ఆర్‌ అంటే రామకృష్ణారెడ్డి అని విమర్శించారు. పదేళ్ల లో రేపల్లెలో అభివృద్ధి జరిగిందా? ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా? జగన్‌ ఇక్కడకు వచ్చారట.. హామీలు ఇచ్చారట. చెక్‌ డ్యాంలు కట్టి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారట. 100 పడకల ఆసుపత్రి అన్నారట. అక్వా రైతుల కోసం ఆక్వా పార్క్‌, ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌ ఇస్తామని చెప్పాడట. ఫిషింగ్‌ హార్బర్‌ కడతామన్నాడట..ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని ప్రశ్నించారు.