బీపీ మండల్ ఆశయాల సాధన కోసం పోరాటం

– బీపీ మండల్ డే లో బీసీవై పార్టీ అధ్యక్షులుడు రామచంద్ర యాదవ్

రాజమండ్రి, మహానాడు: బీపీ మండల్ ఆశయ సాధనకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. మండల్ కమీషన్ సిఫార్సులు అమలు చేసి, పూర్తిస్థాయిలో కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.. కులగణన కోసం తమ పార్టీ అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని చెప్పారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి “బీపీ మండల్ డే” రాజమండ్రి నగరంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీపీ మండల్ విగ్రహావిష్కరణ చేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధినేత మాట్లాడారు.

బీసీల అభ్యున్నతి కొరకు బిపి మండల్ ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆయన సిఫార్సులను తుంగలో తొక్కుతున్నాయని, ఒకటి రెండు మినహా ఆయన సిఫార్సులు ఏమి అమలు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశమంతటా కులగణన జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నుండే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసారు. గత ముఖ్యమంత్రి జగన్ బీసీలను విస్మరించారని, బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చి బీసీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి ఆచరణ దిశగా అడుగులు వేయాలని సూచించారు.

అలాగే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను కలుపుకొని ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిన అండగా నిలబడతామని అయన తెలిపారు. బీసీ ల అభ్యున్నతి, హక్కుల కొరకు పోరాటాలకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు, బీసీవై పార్టీ నాయకులు, బీసీ మండల్ అభిమానులు పాల్గొన్నారు.