అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్

జమ్ము కాశ్మీర్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపి వేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.

శనివారం భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్‌నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపో వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 4 రోజులలో పెద్ద వర్షపాతం ఉండదని, అయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.