గొట్టిపాటి లక్ష్మికి చంద్రబాబు అభినందన

దర్శిలో బాగా పనిచేశారని ప్రశంసలు
కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచన

దర్శి, మహానాడు : దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శనివారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆమెతో పాటు భర్త కడియాల లలిత్‌సాగర్‌, కడియాల రమేష్‌ ఉన్నారు. ఈ సందర్భంగా దర్శిలో విజయం కోసం చేసిన కృషి, వైసీపీ దౌర్జన్యాలు, దాడులను ఎదుర్కొన్న తీరు అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో అత్యధికంగా పోలింగ్‌ నమోదైన దర్శి నియోజకవర్గంలో ఓటర్ల చైతన్యం, యువత ఎక్కువగా పాల్గొనడం, మహిళలు తరలిరావడం లక్ష్మిని విజయం వైపు నడిపిస్తుందని ఆకాంక్షించారు. సీటు ప్రకటించినప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్లిన విధానం, కూటమి మేనిఫెస్టోపై వివరించడం, ప్రజలతో కలిసిపోవడం, సమస్యలు గుర్తించడం ఇలా ఎన్నికల క్యాంపెయిన్‌, పోల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా బాగా చేశారని అభినందించారు. బొట్లపాలెం ఘటనపై పోరాడటం, పోలింగ్‌ ప్రారంభించేందుకు లక్ష్మి చేసిన కృషి ప్రశంసనీయని పేర్కొంటూ కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివ రించారు. డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, కడియాల రమేష్‌ కృషిని ప్రత్యేకంగా అభినందించారు.