గుర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

– డయేరియా మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ

అమరావతి, మహానాడు: విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో ఎనిమిది మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, మంచినీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే అసలు ఘటనకు కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీనిలో భాగంగా సీనియర్ ఐఎఎస్ అధికారి కె. విజయానంద్ తో మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని నిర్ణయించారు.

మరణాలకు అసలు కారణం ఏంటి, ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు ఏంటి అనేది తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలని సీఎం భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని…. సమస్య పరిష్కారం అయ్యేవరకు మంచినీరు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. వైద్య శిబిరాలు కొనసాగించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్లుఎస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ధైర్యం చెప్పి….. సమస్య పరిష్కారం అయ్యేవరకు వారికి అండగా ఉండాలని సీఎం అధికారులను సూచించారు.