– మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, మహానాడు: రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఆగస్టు15 లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాట తప్పినందుకు పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గురువారం యాదాద్రి దేవాలయం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొంటారన్నారు.
ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని యాదగిరి నరసింహాస్వామిని వేడుకుంటాం. ముఖ్యమంత్రి పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని స్వామిని ప్రార్థిస్తాం.. 49వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని డిసెంబర్ నెలలో చెప్పారు. కడుపు కట్టుకుంటే చాలు ఒక్క ఏడాదిలో 40వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో అన్నారు. క్యాబినెట్ లో నిర్ణయించిన 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టారు. మొన్నటి బడ్జెట్ కేటాయింపుల్లో 26వేల కోట్లకు కుదించారు. ఆగస్టు15 నాడు రుణమాఫీ పూర్తయిందని చెప్పి 17వేల కోట్లన్నారు. రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు మంత్రులు కాలేదు అంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, మిగిలిన 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 17 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని అంటున్నారు.
ఇందులో ఎవరి మాట నిజమో తెలియక, రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులు, కలెక్టరేట్ల చూట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు గురువారం ఆలేరులో నిర్వహించే ధర్నాలో పాల్గొంటాను. రైతలందరి తరుపునా ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుదాం.