హైదరాబాద్‌లో పెట్టుబడులకు కోకాకోలాకు ఆహ్వానం

అట్లాంటాలో కంపెనీ డైరెక్టర్‌తో మంత్రుల సమావేశం
ప్లాంట్‌ స్థాపిస్తే సహకారం అందిస్తామని వెల్లడి

హైదరాబాద్‌: అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి శనివా రం అట్లాంటాలోని కోకాకోలా హెడ్‌ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్‌ డైరెక్టర్‌ జోనాథన్‌ రీఫ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకా-కోలా మేనేజ్‌మెంట్‌ ను ఆహ్వానించారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన సమావేశంలో తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఎక్కడ ప్లాంట్‌ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత రెండు దశాబ్ధాలుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని వివరించారు. సానుకూలంగా స్పందించిన జోనాథన్‌ హైదరా బాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు. మంత్రులతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, పెట్టుబడుల శాఖ స్పెషల్‌ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.